హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లో కూర్చుంటే మంచిదని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాకిస్థాన్ మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు ఆటతీరుపై ఇయాన్ చాపెల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ జట్టును టెస్టు సిరిస్కు ఆహ్వానించకపోవడమే మంచిదని చాపెల్ సూచించాడు. ఈ సిరిస్లో పాకిస్థాన్ జట్టు అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురి చేసింది.
'ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఇప్పటివరకూ నాలుగుసార్లు వైట్ వాష్ అయ్యింది. మూడేసి మ్యాచ్ల సిరీస్లను నాలుగుసార్లు కోల్పోయింది. మీరు గేమ్ను మెరుగుపరుచు కోలేకపోతే, పర్యటనల్ని పక్కన పెట్టి ఇంట్లోనే కూర్చోండి. ఎప్పుడూ చెత్త ప్రదర్శన చేసేటప్పుడు పర్యటనలకు ఎందుకు' అని చాపెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్లో తొలి టెస్టు గబ్బా నుంచి మూడు టెస్టు సిడ్నీ వరకు పాకిస్థాన్ బ్యాటింగ్, ఫీల్డింగ్ చాలా పేవలంగా ఉందని అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు మంచి క్రికెట్ను ఆడటంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటుందని చెప్పాడు.

పాకిస్థాన్ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీ తీరుపై కూడా చాపెల్ స్పందించాడు. 'ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో సరైన నాయకుడు లేడు. ఆ జట్టు మిస్బా నుంచి ఏ రకమైన స్ఫూర్తిని పొందినట్లు కనబడటం లేదు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు అనివార్యం' అని చాపెల్ విమర్శించాడు.
73 ఏళ్ల చాపెల్ ఆస్ట్రేలియా జట్టుకు ఈ సందర్భంగా ఒక సలహా ఇచ్చాడు. టెస్టు క్రికెట్లో కనీసం పోరాడలేనటువంటి పాకిస్తాన్ జట్టును రాబోయే రోజుల్లో పర్యటనలకు పిలవకుండా ఉండటం మంచిదంటూ చాపెల్ అభిప్రాయపడ్డాడు.