
సిడ్నీ: అత్యంత క్లిష్ట సమయాల్లో క్రికెట్ బలంగా నిలువలేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా మరోసారి గుర్తు చేసిందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అన్నాడు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2021 టోర్నీ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే దీని కారణంగా భారత్లోనే జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కూడా వేరే చోటకు తరలిపోయే అవకాశం ఉందని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది భారత్లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది.
'భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరగడం, ఊహించనన్ని మరణాలు సంభవించడం, ఆటగాళ్లూ మహమ్మారి బారిన పడడంతో ఐపీఎల్ 2021ను మధ్యలోనే ఆపేశారు. క్రికెట్లో అస్థిరతకు ఇది నిదర్శనం. ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో ఐపీఎల్ మాత్రమే కాదు ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడడం లేదా మరో వేదికకు మారే అవకాశాలను కొట్టి పారేయలేం' అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు.
గతంలోనూ అనూహ్య పరిస్థితుల దృష్ట్యా అనేక పర్యటనలు రద్దు కావడం, మ్యాచ్లు ఆగిపోయిన ఉదంతాలు ఉన్నాయని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ గుర్తు చేశాడు. 1970-71లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య బాక్సింగ్ డే టెస్టు వాతావరణం సరిగా లేక రద్దవగా.. ఈ మ్యాచ్ స్థానంలో తొలిసారి ఒక వన్డేకు అంకురార్పణ జరిగింది. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఆ జట్టుకు 75 టెస్టులు, 16 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులో 5345, వన్డేల్లో 673 రన్స్ బాదాడు.
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్, కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్.. ఈ ఏడాదిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్పై ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్ను భారత్లో నిర్వహించకపోవడమే మంచిదన్నాడు. భారతీయులకు ఏది మంచిదో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో మెగా టోర్నీని యూఏఈకి తరలించడం మంచిదని కమిన్స్ పేర్కొన్నాడు.