
సౌథాంప్టన్: కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో భారత్లో లక్షల మందికి వైరస్ సోకగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ ఇయాన్ బిషప్ భావోద్వేగం చెందారు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను భారత్ గెలిచి కరోనా బాధితులకు కాస్త ఊరట కలిగించాలని కోరారు. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడని, ఒకవేళ అదే నిజమైతే అతడికది గొప్ప విశేషమని బిషప్ పేర్కొన్నారు. కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని, ఒక మంచి కెప్టెన్కు ఉండాల్సిన లక్షణమని విండీస్ దిగ్గజ బౌలర్ పేర్కొన్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో ఇయాన్ బిషప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్లోని కరోనా పరిస్థితిని, డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడారు. 'టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం విరాట్ కోహ్లీకి అతిగొప్ప విశేషం. కోహ్లీ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మంచి కెప్టెన్లకు ఉండాల్సిన లక్షణాల్లో అది ఒకటి. కేన్ విలియమ్సన్తో పాటు టాప్ లెవెల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగులు చేయడమే అతడికి తెలుసు. కోహ్లీలా బాగా ఆడేవాళ్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అయితే అతడింకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది' అని బిషప్ అన్నారు.
'విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ ట్రోఫీ కచ్చితంగా గెలుపొందాలని అనుకుంటాడు. ఎందుకంటే దానికోసం అతడు చాలా కష్టపడ్డాడు. ఎన్నో మ్యాచులు గెలిచి భారత్ ఇక్కడకు వచ్చింది. పోటీని తట్టుకుని ఫైనల్ చేరింది. ఇక ఫాస్ట్ బౌలర్లపై నమ్మకం ఉంచి, జట్టులో మార్పులు చేసి సానుకూల దృక్పథంను విరాట్ తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. జట్టు కోసం, దేశం కోసం అతడి కెప్టెన్సీలో ఛాంపియన్షిప్ టైటిల్ ఉండాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం లేదు' అని వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ ఇయాన్ బిషప్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ రెండో దశలో భారత్ ఎంత తీవ్రంగా నష్టపోయిందో తెలిసిందే. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు దేశం తరఫున టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం సాధించి, ఆ ట్రోఫీతో బాధితులకు ఊరట కలిగించాలని ఇయాన్ బిషప్ కోరారు. ఈనెల 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా ఏజీయస్ మైదానంలో టీమ్ఇండియా.. న్యూజిలాండ్ జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. గెలుపు కోసం ఇరు జట్లు ముమ్మర సాధన చేస్తున్నాయి.