ప్రధాని మోదీ మిస్సేజ్తో నిద్ర లేచా
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉదయాన్నే తనకు వ్యక్తిగతంగా సందేశం పంపినట్టు క్రిస్ గేల్ తెలిపాడు. మోదీ సందేశంతో తాను నిద్రలేచానని చెప్పాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భారత దేశ ప్రజలతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి గేల్ గుర్తు చేసుకున్నాడు. భారత్లో ఐపీఎల్లో ఆడడమేకాకుండా భారత ఆటగాళ్లతో కలిసి ఇతర లీగ్ల్లో ఆడానని చెప్పుకొచ్చాడు. ఇందుకు తాను గౌరవంగా భావిస్తున్నట్టు గేల్ ట్వీట్ చేశాడు.

భారతీయులతో మంచి సంబంధాలు
''73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు నాకు వ్యక్తి గతంగా పంపిన సందేశంతోనే నిద్ర లేచాను. ప్రధాని నరేంద్ర మోదీతో, భారతీయులతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ యూనివర్సల్ బాస్ నుంచి మీకు ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు'' అంటూ గేల్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం గేల్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.

ఐపీఎల్లో గేల్
42 ఏళ్ల క్రిస్ గేల్ తన క్రికెట్ కెరీర్లో అనేక రికార్డులు సృష్టించాడు. ముఖ్యంగా సిక్సర్లు బాదడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇక ఇండియాలో ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ ద్వారా భారతీయులతో విడదీయరాని సంబంధం ఏర్పరచుకున్నాడు. ఐపీఎల్లో గేల్.. కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సుదీర్ఘ కాలం ఆడిన గేల్.. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ తన ఆటతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన గేల్ అనేక రికార్డులను సృష్టించాడు.

గేల్ రికార్డులు
ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాళ్లలో క్రిస్ గేల్ ఒకడు. ఇప్పటివరకు 142 మ్యాచ్లు ఆడిన గేల్ 39 సగటుతో 4,965 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా గేల్ రికార్డు సృష్టించాడు. గేల్ అత్యధిక స్కోర్ 175 పరుగులు. ఐపీఎల్లో గేల్ చేసిన 175 పరుగులే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. ఈ క్రమంలో 405 ఫోర్లు కొట్టిన గేల్, రికార్డు స్థాయిలో 357 సిక్సులు కూడా బాదాడు.


Click it and Unblock the Notifications












