హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీని కలిసేందుకు వెళ్లిన తనతో అతను మాట్లాడలేదని భార్య హసీన్ జహాన్ తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైన షమీ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా షమీపై ఆరోపణలు చేస్తూ వచ్చిన అతని భార్య హసీన్ భర్తను పరామర్శించేందుకు ఢిల్లీకి వెళ్లింది. ఎంతో ప్రేమతో తనని కలిసేందుకు వచ్చిన హసిన్ జహాన్ని కలిసేందుకు షమీ నిరాకరించాడు. కేవలం తన కూతురితో మాత్రమే కాసేపు ముచ్చటించి పంపించినట్లు హసిన్ జహాన్ మీడియాకు తెలిపింది.
అనంతరం జహాన్ విలేకరులతో మాట్లాడుతూ 'షమీ గాయపడ్డాడని అతన్ని చూసేందుకు వచ్చా. కానీ అతను నన్ను కలిసేందుకు అంగీకరించలేదు. నిన్ను కోర్టులోనే చూస్తా అని నన్ను బెదిరించాడు. అయితే, షమీ కూతురితో మాత్రం ముచ్చటించాడు. వాళ్ల అమ్మ మా మధ్య బాడీగార్డులాగా నిలుచుంది' అని తెలిపింది.
తనను కలిసేందుకు నిరాకరించినా, అతడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని జహాన్ తెలిపింది. ఐపీఎల్ 2018 సీజన్ కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో చేరేందుకు డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి కారులో వెళ్తుండగా షమీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
దీనిపై హసీన్ మాట్లాడుతూ 'నా పోరాటం షమీ నా విషయంలో చేసిన ద్రోహంపై కానీ అతనిపై కాదు. కానీ అతను శారీరకంగా గాయపడాలని నేను కోరుకోలేదు. అతను నేను తన భార్యలా ఉండాలని అతను అనుకోకపోవచ్చు. కానీ అతన్ని మాత్రం నేను ఇంకా ప్రేమిస్తున్నాను' అని తెలిపింది.
షమీ తనపై గృహహింసకు పాల్పడ్డాడని, అతనికి చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.