నడిచే ఓపిక ఉన్నంతవరకు ఐపీఎల్ ఆడతానని ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అన్నాడు. ఐపీఎల్ తన ఆటకు ఎంతో మేలు చేసిందని, సీనియర్లు, కోచ్ సలహాలతో తన కెరీర్ మారిపోయిందని తెలిపాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసీస్ ప్లేయర్లు వీలైనంత ఐపీఎల్ అనుభవాన్ని పొందాలని మాక్సీ సూచించాడు.
ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మాక్స్వెల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ టోర్నమెంట్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన కెరీర్ లో ఐపీఎల్ చివరి టోర్నమెంట్ అని పేర్కొన్నాడు.

''ఐపీఎల్ నాకు ఎంతో మేలు చేసింది. సీనియర్లు, కోచ్ లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల నా కెరీర్ మారిపోయింది. ఇక దాదాపు రెండు నెలలు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి వంటి మేటి ఆటగాళ్లతో కలిసి ఆడటం, వారితో మాట్లాడటం, వారి ఆటను చూడటంతో.. నా ఆటను ఎంతో మెరుగుపర్చుకున్నా. ఏ ప్లేయర్ కు అయినా నేర్చుకోవడానికి ఇంతకంటే మరో గొప్ప మార్గం ఉండదు'' అని మాక్స్ వెల్ చెప్పాడు. ఐపీఎల్ లో మాక్సీ ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
''ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎక్కువ మంది ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే భారత్ లోని పరిస్థితులు వెస్టిండీస్ లో ఉంటాయి. స్పిన్ కు అనుకూలిస్తాయి'' అని మాక్సీ అన్నాడు. వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ నకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది.
కాగా, రేపటి నుంచి బిగ్ బాష్ లీగ్ ప్రారంభం కానుంది. మెల్ బోర్న్ స్టార్స్ జట్టు తరఫున మాక్స్ వెల్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్ - మెల్ బోర్న్ స్టార్స్ జట్లు తలపడనున్నాయి.