మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు టీ20ల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్పై అఫ్గానిస్థాన్కు ఇదే అత్యధిక స్కోరు. మహ్మద్ నబీ (42; 27 బంతుల్లో) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/33), అక్షర్ పటేల్ (2/23), దూబె (1/9) సత్తాచాటారు.
అనంతరం ఛేదనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది. రోహిత్ శర్మ (0) ఆదిలోనే రనౌటయ్యాడు. తిలక్ వర్మ (26; 22 బంతుల్లో)తో కలిసి గిల్ (23; 12 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ముజీబ్ బౌలింగ్లో గిల్ స్టంపౌటయ్యాడు. కాసేపటికీ తిలక్ వర్మ కూడా పెవిలియన్కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జితేశ్ (31; 20 బంతుల్లో) కలిసి శివమ్ దూబె కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జితేశ్ ఔటైనా రింకూ సింగ్ (16*; 9 బంతుల్లో)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆల్రౌండర్ షోతో సత్తాచాటిన దూబె (1/9; 60*; 40 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ''మొహాలిలో చలి చాలా ఎక్కువగా ఉంది. ఎంతోకాలం తర్వాత తిరిగి టీమిండియాలోకి రావడం, అంతేగాక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యా. దీంతో నా ఆట నేను ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ తొలి రెండు బంతులు ఎదుర్కొన్నప్పుడు ఒత్తిడికి గురయ్యా. దీంతో మిగిలిన విషయాలు వదిలేసి బంతిపై మాత్రమే ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నా. టీ20ల్లో నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. భారీ సిక్సర్లు సాధించగలనని, ఏ సమయంలోనైనా పరుగులు చేయగలనని తెలుసు''
''ఎంఎస్ ధోనీతో మాట్లాడుతూనే ఉన్నాను. అతడు ఓ లెజెండ్. అతడి నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బ్యాటింగ్ చేయాలో చెబుతుండేవాడు. అతడు ఇచ్చిన సలహాలు సత్ఫలితాన్నిస్తుంటాయి. నేను మంచి ప్లేయర్గా ధోనీ ఎన్నోసార్లు రేటింగ్ ఇచ్చాడు. మంచి ప్లేయర్గా ధోనీ అభివర్ణించాడంటే నేను కచ్చితంగా గొప్పగా ఆడగలను. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది''
''ఇక బౌలింగ్ విషయానికొస్తే... ఇదంతా రాత్రికి రాత్రి జరగలేదు. దానిపై ఎంతో శ్రమించా. బౌలింగ్ అవకాశం కోసం ఎంతో ఎదురుచూశా. ఈ రోజు ఛాన్స్ దక్కింది. దాన్నిసద్వినియోగం చేసుకున్నా. బౌలింగ్ విషయంలో రోహిత్ నాకో మాట ఇచ్చాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి రెండు నుంచి మూడు ఓవర్లు బౌలింగ్కు అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇదో మంచి శుభవార్త. క్రమం తప్పకుండా బౌలింగ్ చేయడం నాకు సానుకూలాంశంగా మారుతుంది'' అని దూబె అన్నాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన దూబె ఒక వికెట్ తీసి 9 పరుగులిచ్చాడు. ఐపీఎల్లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున దూబె ఆడుతున్న విషయం తెలిసిందే.