టెర్రరిస్ట్ వార్డులో ఉంచారు
తాజాగా క్రిక్ట్రాకర్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇంటర్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ... 'మీరు నా జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఇది నాకు రెండో జన్మ. ఆ రోజు మ్యాచ్ పార్టీ ముగిసిన తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసారు. ఆపై టెర్రరిస్ట్ వార్డులో ఉంచారు. నన్ను బక్రాను చేస్తున్నట్లు భావించాను. దాదాపు 12 రోజుల పాటు రోజుకి 16-17 గంటలు నరకం అనుభవించాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ, ఇల్లు గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని' అని తెలిపాడు.
నా కుటుంబం అండగా నిలిచింది
'కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య నన్ను చూడడానికి వచ్చాడు. నాకు ప్రాణం లేచివచ్చినట్టైంది. కుటుంబంలో అందరూ బాగున్నారు అని అన్నయ్య చెప్పక నా మనసు కొంత కుదుటపడింది. క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ఇక్కడ ఓ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే.. నేను జైలుకి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ నా ఫొటోలు తీయలేదు. దాంతో నా పిల్లలు వాటిని చూసే బాధపడతారనే బెంగ లేదు' అని కేరళ స్పీడ్స్టర్ చెప్పాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లాడి.. మొత్తం 169 వికెట్లు పడగొట్టాడు.
సచిన్ కూడా సున్నా నుండే బ్యాటింగ్ చేస్తాడు:
'ఇక్కడ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ప్రతి యుద్ధంలో గెలవడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ సొంత యుద్ధంలో పోరాడుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక గేమ్లో సెంచరీ చేసినా.. తదుపరి గేమ్లో సున్నా నుండి బ్యాటింగ్ చేస్తాడు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 10 సెకన్ల పాటు ఆలోచించండి, అప్పుడే తెలుస్తుంది మనం గెలుస్తామని. మీరు సాధించాలనుకున్నది సాధించండి, అంతేకాని ప్రపంచం చెప్పే దాని కోసం వేచి ఉండకండి' అని శ్రీశాంత్ హితవు పలికాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచీ టస్కర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్కి ఆడిన శ్రీశాంత్.. 44 మ్యాచ్ల్లో 40 వికెట్లు పడగొట్టాడు.
వచ్చే సెప్టెంబరుతో శిక్షా కాలం పూర్తి
2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది.
2023 ప్రపంచకప్ ఆడతా
బ్యాన్ ముగియగానే కేరళ తరఫున రంజీల్లో శ్రీశాంత్ను ఆడించాలని ఇప్పటికే కేరళ క్రికెట్ అసోషియేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. కేరళ రంజీ ట్రోఫీ జట్టులోకి అతడిని ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. రంజీ కోసం ఎంపిక చేసే ప్రాబబుల్స్లో 37 ఏళ్ల శ్రీశాంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు జట్టు కోచ్ టిను యోహానన్ వెల్లడించాడు. రంజీ సీజన్లో శ్రీశాంత్ నిలకడగా రాణించగలిగితే.. అతను ఇండియా-ఎ టీమ్కి ఆ తర్వాత భారత జట్టుకి ఆడే అవకాశం లేకపోలేదు. కానీ దాదాపు ఏడేళ్లు క్రికెట్కు దూరంగా ఉన్న 37 ఏళ్ల శ్రీశాంత్కు అది సాధ్యమేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ప్రస్తుతం భారత జట్టులో నెలకొన్న పోటీ కూడా అది అసాధ్యమనే భావనను కలిగిస్తోంది. కానీ శ్రీశాంత్ మాత్రం 2023 ప్రపంచకప్ ఆడగలననే విశ్వాసంతో ఉన్నాడు.