న్యూఢిల్లీ: బౌలర్లను ఉతికి ఆరేస్తూ వచ్చిన విధ్వంసక బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ను భయపెట్టిన బౌలర్ ఒక్కతను ఉన్నాడు. తన 37వ జన్మదినం సందర్భంగానే సెహ్వాగ్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే కాకుండా ఐపిఎల్ నుంచి కూడా తప్పుకుంటూ ప్రకటన చేశాడు.
తాను శ్రీలంక స్పిన్నర్ బౌలింగ్కు మాత్రమే భయపడేవాడినని, ఏ ఇతర బౌలర్ కూడా తనను భయపెట్టలేదని సెహ్వాగ్ చెప్పాడు. తాను ఆ ఒక్క బౌలర్ను ఎదుర్కోవడానికి మాత్రమే భయపడేవాడినని, అతను ముత్తయ్య మురళీథరన్ అని ఆయన చెప్పాడు.

సెహ్వాగ్ భారత్ కోసం 2013 మార్చి వరకు ఆడాడు. అతను అంతర్జాతీయ క్రికెట్లో 17 వేల పరుగులకు పైగా చేశాడు. క్రికెట్ క్రీడలో చాలా మంది బౌలర్లకు సెహ్వాగ్ చుక్కలు చూపించాడు. బ్యాటింగ్ విషయంలో సాంకేతికపరమైన విషయాలకు అతను ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వలేదు. వచ్చిన బంతులను ఏకి పారేయడమే పనిగా పెట్టుకునే వాడు.

బంతిని చూడాలి, వీర బాదుడు బాదాలనే అతని ధోరణి 14 ఏళ్ల పాటు పనిచేసింది. టెస్టు క్రికెట్ గతినే సెహ్వాగ్ మార్చేశాడు. టెస్టు క్రికెట్లో కూడా అతని తనకు ఎదురైన ప్రతి బంతినీ ధాటిగా ఆడడమే పనిగా పెట్టుకునే వాడు.