
హైదరాబాద్: గత మూడు నెలలుగా పరుగుల దాహంతో ఉన్నానని టీమిండియా యువ బ్యాట్స్మన్ పృథ్వీషా చెప్పాడు. తాజాగా ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పృథ్వీ షా మాట్లాడుతూ "నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటిని అధిగమించాల్సి వచ్చింది. గత మూడు నెలలుగా పరుగుల దాహంతో ఉన్నాను" అని అన్నాడు.
"నిషేధిత కాలంలో ఎంతో మంది నాకు అండగా నిలిచారు. ఆ సమయంలో ఎంతో నేర్చుకున్నాను. బాగా శ్రమించాను. పునరాగమనం తర్వాత అద్భుతంగా చెలరేగాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను. సెంచరీని డబుల్ సెంచరీగా మలచడం సంతోషంగా ఉంది. భారీ ఇన్నింగ్స్ ఆడాలని 100-150 మధ్యలో నిదానంగా బ్యాటింగ్ చేశాను" అని పృథ్వీ షా వెల్లడించాడు.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన పునరాగమనాన్ని డబుల్ సెంచరీతో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. 100-150 మధ్యలో ఎన్నో సార్లు ఔటయ్యాడనని, అయితే, ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడ్డానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో అండర్-19 వరల్డ్కప్కు ఎంపికైన యువ స్పిన్నర్ అధర్వ అంకోలేకర్ను సత్కరించారు.
రంజీ ట్రోఫీ 2019-20 సీజన్లో పృథ్వీషా అద్భుతంగా రాణిస్తున్నాడు. బరోడాతో జరిగిన తొలి మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. 174 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించడంతో రంజీ క్రికెట్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వన్డే వరల్డ్కప్కు శుక్రవారం టీమిండియా బయల్దేరి వెళ్లింది.