
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరిస్ను తిరిగి దక్కించుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది.
మూడో టెస్టు మ్యాచ్ జరిగిన వాకా స్టేడియంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్కు ఎన్నో తీపిగుర్తులు ఉన్నాయి. 2010లో ఇదే స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ని ఆడాడు. అంతేకాదు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించడం కూడా స్టీవ్ స్మిత్కు ఇదే మొదటిసారి.

ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్ తన అనుభవాలను ఏబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్యూలో పంచుకున్నాడు. 'యాషెస్ సిరీస్కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది' అని అన్నాడు.
'మూడో టెస్టు చివరి రోజు ఆట ముగియగానే సిరీస్ గెలిచిన ఆనందంలో ఒక్క నిమిషం ఆనందంతో ఏడ్చేశాను. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. ఆ భావాన్ని ఎలా వివరించాలో అర్థంకావడం లేదు. నా కల నిజమైంది. సొంతగడ్డపై సిరీస్ గెలవాలని జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఎంతో కష్టపడ్డాడు' అని తెలిపాడు.
'తొలిసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు నా మార్క్ ఏమిటో చూపించాలనుకున్నా. మంచి ఫలితాలు రాబట్టాలనుకున్నా. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. డ్రస్సింగ్ రూమ్లో అందరం ఎలా ఆడాలన్న దానిపైనే ఎక్కువగా చర్చించుకునేవాళ్లం' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.
పెర్త్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్లో అతడికిది రెండో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడం విశేషం. తొలి టెస్టులో కూడా స్మిత్కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, సిరిస్లో భాగంగా డిసెంబర్ 26న నాలుగో టెస్టు మెల్ బోర్న్లో ప్రారంభంకానుంది.