

హైదరాబాద్: సిరిస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని మూడో వన్డే విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. కేప్ టౌన్ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆరు వన్డేల సిరిస్లో కోహ్లీసేన 3-0తో ఆధిక్యంలో ఉంది. భారత్ నిర్దేశించిన 304 పరుగుల భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్(4/46), కుల్దీప్ యాదవ్(4/23) సఫారీ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు.
దీంతో సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్లో వరుసగా మూడో విజయం అందించిన తొలి భారత కెప్టెన్గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు రెండున్నర దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును కోహ్లీసేన ఒడిసిపట్టుకుంది.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'చివరి వరకు ఎవరో ఒకరు బ్యాటింగ్ చేయాలి. ఆ పని కెప్టెన్గా నేనే చేయడం సంతోషంగా ఉంది. శిఖర్ ధావన్తో చక్కటి భాగస్వామ్యం, చివర్లో భువీ అందించిన సహకారం భారత్ విజయానికి కారణం. చివర్లో కండరాలు పట్టేశాయి. కానీ 300 దాటాలంటే చివరి వరకు నేనుండాలి' అని అన్నాడు.
దక్షిణాఫ్రికాను 6-0తో వైట్ వాష్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గాను 'ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు. మానసికంగా, శారీరకంగా జట్టుకు ఇదొక పరీక్ష. స్పిన్నర్లతో సఫారీలను ఒత్తిడికి గురి చేయడంలో విజయవంతం అయ్యాం. నాలుగో వన్డేలో ఇంకా పోరాడతాం. ఇక సిరీస్ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు' అని కోహ్లీ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.