హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్ధి బౌలర్ ఎంతటి వాడైనా సరే చుక్కలు చూడాల్సిందే. ఏమాత్రం కనికరం లేకుండా బంతులను బౌండరీలకు తరలిస్తాడు. దీంతోనే కోహ్లీని అభిమానులు ముద్దుగా 'రన్ మెషిన్' అని పిలుచుకుంటూ ఉంటారు.
అటువంటి కోహ్లీని భయపెట్టిన బౌలర్ ఉన్నాడంటే నమ్ముతారా? కానీ అది నిజం. కోహ్లీని ఓ బౌలర్ను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డాడంట. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. ఓ హిందీ టీవీ ఛానెల్ దీపావళిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, విరాట్ కోహ్లీతో చాట్ షో నిర్వహించింది.
ఈ చాట్ షో ముంబై ఫిల్మ్ సిటీలోని ఓ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ ఇంటర్యూలో విరాట్ కోహ్లీ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కోహ్లీ తనను భయపెట్టిన బౌలర్ గురించి తెలిపాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో లసిత్ మలింగ యార్కర్లను ఎదుర్కోవడానికి భయపడ్డానని చెప్పాడు.

రెండు మూడు బంతులు ఆడిన తర్వాతనే క్రీజులో కుదురకున్నానని చెప్పాడు. ఈ చాట్ షోని దీపావళి సందర్భంగా ప్రసారం చేయనున్నారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 31 పరుగులకే సచిన్, సెహ్వాగ్ల వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ సమయంలో బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ, గంభీర్ సాయంతో 83 పరుగులు జోడించి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో గంభీర్తో కలిసి కోహ్లీ అందించిన ఆ భాగస్వామ్యం ఎంతో కీలకమైంది.