ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 2014 వరకు ఆడుదాముకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.టెండుల్కర్ గత ఏడాది రిటైరైన విషయం తెలిసిందే. అయితే, అప్పటికే ఆయన రిటైర్మెంట్ ఆలస్యమైందని చాలామంది అన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సచిన్ తాను మరో ఏడాది కొనసాగుదామనుకున్నట్లు చెప్పాడు.
గత ఏడాది ఆఖర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో పాటు ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటన పైన దృష్టి పెట్టానని, ఐతే బీసీసీఐ ఉన్నట్లుండి వెస్టిండీస్ సిరీస్ను ప్రకటించడంతో తన ప్రణాళికల పైన పునరాలోచించుకున్నానని సచిన్ చెప్పాడు. విండీస్తో సిరీసే తనకు ఆఖరు అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన మొదలైందని చెప్పాడు.
ఆ తర్వాత తన భార్య అంజలి, సోదరుడు అజిత్లతో చర్చించానని తెలిపాడు. విండీస్ సిరీస్ తర్వాత రిటైరవ్వాలనుకుంటున్నట్లు చెప్పానని, సిరీస్ చివరి మ్యాచ్ తనకు 200వ టెస్టు కావడం, పైగా 2014 చివరి వరకు మరో సిరీస్ లేకపోవడంతో సొంత గడ్డ పైన రిటైరయ్యే అవకాశాలు తక్కువగా కనిపించడంతో ఇంకెంత కాలం సాగదీయడం ఇష్టం లేకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

2007 ప్రపంచ కప్ తొలి రౌండ్లోనే భారత్ జట్టు నిష్క్రమించిన సమయంలో పాఠశాలలో ఎవరైనా తన గురించి చెడుగా మాట్లాడినా పట్టించుకోవద్దని తన కొడుకు అర్జున్ టెండుల్కర్కుచెప్పానని సచిన్ చెప్పాడు. అయితే, అప్పటికే ఏడేళ్ల వయసున్న అర్జున్ తన సూచనను పట్టించుకోలేదని చెప్పాడు. మీ నాన్న డకౌట్ అవడం వల్లే భారత్ ఒడిందని అన్న స్నేహితుడిని కొట్టాడని సచిన్ చెప్పాడు.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్ చాంపియన్షిప్ మ్యాచ్లను చూసేందుకు వెళతానని భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ తెండూల్కర్కు వీరాభిమానిగా అందరికీ సుపరచితుడైన సుధీర్ గౌతం ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఒంటికి, ముఖానికి త్రివర్ణ పతాకం రంగులు అద్దుకొని, జాతీయ పతాకాన్ని పట్టుకొని స్టేడియంలో సందడి చేసే సుధీర్ టీమిండియాను వెన్నంటే ఉంటాడు. జట్టు ఎక్కడికి వెళ్లినా అతనూ వెళతాడు. శంఖారావంతో హడావుడి చేస్తాడు. క్రికెటర్లతోపాటు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధికారులకు కూడా సుధీర్ బాగా తెలుసు.
2011లో భారత జట్టు ప్రపంచ కప్ను గెల్చుకున్న తర్వాత, ఆ కప్ను పట్టుకొని, సచిన్తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడంటే అతనికి ఉన్న గుర్తింపు ఎలాంటిదో ఊహించుకోచ్చు. ఇప్పుడు సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ, అతని స్ఫూర్తి జట్టుతోనే ఉంటుందని సుధీర్ నమ్మకం. 'మిస్ యు టెండూల్కర్' అని ఛాతీపై పెయింట్ చేయించుకొని మరీ తిరిగే ఆ వీరాభిమాని తనకు టీమిండియాతో కలిసి వెళ్లే ప్రతి పర్యటన ఒక తీర్థయాత్ర లాంటిదని వ్యాఖ్యానించాడు.