
హైదరాబాద్: భారత జట్టులో ప్రధాన స్పిన్నర్గా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అశ్విన్... టీమిండియా తరుపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి దాదాపు ఏడాది కావొస్తుంది.
గతేడాది జూన్ 30న వెస్టిండిస్తో జరిగిన వన్డే మ్యాచ్లో చివరిసారిగా కనిపించిన అశ్విన్ ఇప్పటివరకు మొత్తం 111 వన్డేలాడాడు. ఇక, టీ20ల విషయానికి వస్తే గతేడాది జూలై 9న చివరిసారిగా అంతర్జాతీయ టీ 20లో కనిపించాడు.
టెస్టుల్లో మాత్రం రెగ్యులర్ ఆడుతున్న అశ్విన్ ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో ఐదో స్థానంలో ఉన్నాడు. గత కొంతకాలంగా టీమిండియా విజయాల్లో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్లు కీలకంగా మారడంతో అశ్విన్ చోటు దక్కించుకోలేక పోతున్నాడు.
అయితే, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో డుండిగల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తోన్న అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో తరిగి చోటు దక్కించుకోవడంపై మాట్లాడాడు.
"వన్డే వరల్డ్ కప్లో టీమిండియా తరపున బ్లూ జెర్సీ ధరించడం కోసం ఎదురుచూస్తున్నా. కాకపోతే అది నా చేతుల్లో లేదు. నాకు స్థానం దక్కుతుందా.. లేదా అనేది టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లపై ఆధారపడి వుంది. ఇక్కడ ఏ క్రికెటరైనా జట్టులో చోటు దక్కించుకోవాలంటే సెలక్టర్లు, మేనేజ్మెంట్దే నిర్ణయం" అని అన్నాడు.
"నేనేమీ మినహాయింపు కాదు. కాకపోతే వరల్డ్ కప్లో టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనే అనుకుంటున్నా. ప్రస్తుతం నాకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నా.. ఆటను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగడమే నా పని" అని అశ్విన్ తెలిపాడు.