ఇవాళ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సిరాజ్కు సంబంధించిన స్పెషల్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. భాగ్యనగరంతో తనకి ఉన్న అనుబంధాన్ని, తన అలవాట్లు, కష్టాలు, అనుభవాలను వివరించాడు. 2019-20లో మరో ఏడాది తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలకాలనుకున్నాని సిరాజ్ తెలిపాడు.
''హైదరాబాద్కు వచ్చిన తర్వాత తొలుత ఇంటికి, ఆ తర్వాత గ్రౌండ్కు వెళ్లాలనిపిస్తుంది. ఇక్కడ దొరికిన ప్రశాంతత ప్రపంచంలో ఎక్కడైనా సరే నాకు లభించదు. చిన్నతనం నుంచే క్రికెట్పైనే ధ్యాస ఉండేది. ఇంట్లో వాళ్లు చదువుకోమని ఎంత చెప్పినా వాళ్ల మాట వినలేదు. కేటరింగ్ జాబ్ చేసేవాడిని. మా ఇంట్లో నాన్న ఒక్కడే పనిచేసేవారు. వాళ్లకు కాస్త అండగా నిలిచేవాడిని''

''నాకు వచ్చే 200 రూపాయిల్లో ఇంట్లోకి 100 నుంచి 150 ఇచ్చేవాడిని. నా కోసం రూ.50 ఉంచుకునేవాడిని. ఇక పనిలో రూమాలి రోటీ చేసేటప్పుడు నా చేతులు కాలిపోయేవి. అది ఫర్వాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి వచ్చాను. శ్రమ ఎప్పటికీ వృథా కాదు. అంతిమంగా కచ్చితంగా ప్రతిఫలాన్ని అందుకుంటాం'' అని సిరాజ్ వీడియోలో పేర్కొన్నాడు.
బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో సిరాజ్ స్నేహితులు, బంధువులు మాట్లాడారు. సిరాజ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా ఇష్టపడతాడని తెలిపారు. లోకల్ మ్యాచ్ల్లో భారీ షాట్లు ఆడేవాడని పేర్కొన్నారు.30 ఏళ్ల సిరాజ్ 2017లో న్యూజిలాండ్తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కానీ 2020లో టెస్టు అరంగేట్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.
2020లో ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ టీమిండియా టెస్టు క్యాప్ను అందుకున్నాడు. అయితే ఆ సమయంలో సిరాజ్కు ఊహించిన షాక్ తగిలింది. టెస్టు సిరీస్ మధ్యలో తన తండ్రి మరణ వార్త తెలిసింది. అయినప్పటికీ ధైర్యంగా నిలిచి దేశం తరఫున సిరాజ్ గొప్పగా పోరాడాడు. సీనియర్ పేసర్లు గాయాలతో దూరమవ్వడంతో గబ్బా టెస్టులో భారత పేస్ దళాన్ని నాయకుడిగా నడిపించాడు. కాగా, ఇటీవల జరిగిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో సిరాజ్ ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.