డ్రాగా తొలి టెస్ట్..
కాగా- ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రోజు చివరి ఓవర్.. చివరి వికెట్ వరకూ సాగిందీ మ్యాచ్. ఒక్క వికెట్ పడి ఉంటే ఆ మ్యాచ్ భారత్ ఖాతాలో పడి ఉండేది. చివరి రోజు టీమిండియా బౌలర్లు తొమ్మిది ఓవర్లు సంధించినప్పటికీ.. చివరి వికెట్ను తీసుకోలేకపోయారు. న్యూజిలాండ్ టెయిలెండర్ బ్యాటర్లు టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్ వికెట్ పడకుండా ఆడారు. అసమాన పోరాట పటిమను ప్రదర్శించారు. మ్యాచ్ను డ్రాగా ముగించేయగలిగారు.
వాంఖెడె స్టేడియంలో రెండో టెస్ట్
ఇక రెండో టెస్ట్ మ్యాచ్కు ముంబై వాంఖెడె స్టేడియం వేదికగా మారింది. శుక్రవారం ఉదయం మ్యాచ్ ఆరంభమౌతుంది. ఉదయం 9 గంటలకు టాస్ పడుతుంది. 9:30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.. వర్షం పడకుంటే. ఈ పిచ్ మీద విరాట్ కోహ్లీకి మంచి గ్రిప్ ఉంది. ఈ స్టేడియంలోనే అతను టెస్టుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 235 పరుగులు సాధించాడు. వ్యక్తిగతంగా ఈ స్టేడియంలో ఇది రెండో అత్యుత్తమ బెస్ట్ స్కోర్. క్లైవ్ లాయిడ్ చేసిన 242 పరుగులే ఇప్పటికీ వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్గా కొనసాగుతోందీ పిచ్పై.
టిపికల్ వికెట్..
శుక్రవారం మ్యార్ ఆరంభం కానుండటంతో విరాట్ కోహ్లీ ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. తన అభిప్రాయాలను పంచుకున్నాడు. వాంఖెడె పిచ్ ఎప్పుడూ టిపికల్ వికెటేనని వ్యాఖ్యానించాడు. ప్రతికూల వాతావరణంలో ఆడే పరిస్థితులను కల్పిస్తుంటుందని చెప్పాడు. ఇది బౌన్సీ పిచ్ అని, బంతి జెన్యూన్గా బౌన్స్ అవుతుంటుందని చెప్పాడు. అలాగే- రివర్స్ స్వింగ్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్.. స్పిన్.. ఇలా అన్ని రకాల బౌలింగ్కు సహకరించడం దీని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఈ వికెట్పై మరోసారి భారీ స్కోర్ను సాధిస్తామనే ఆశాభావాన్ని విరాట్ కోహ్లీ వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికా టూర్పై..
దక్షిణాఫ్రికా పర్యటన పైనా విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ సిరీస్ ఉంటుందని పేర్కొన్నాడు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. టీమ్ మెంబర్లతో మాట్లాడుతున్నాడని అన్నాడు. టెస్ట్ సిరీస్కు అందుబాటులో లేని ప్లేయర్లు, క్వారంటైన్లో వెళ్లిన వారితో ఫోన్ ద్వారా సంప్రదింపులు సాగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా షెడ్యూల్ రద్దవుతుందనే సమాచారం ఏదీ లేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.