కరాచీ: వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ చిత్తు అయిన విషయం తెలిసిందే. మరీ దారుణంగా 150 పరుగుల తేడాతో పాక్ను విండీస్ మట్టికరిపించింది. ఈ ఓటమి పైన షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. మిస్బా లాంటి పిరికి కెప్టెన్ను, స్వార్థపరుడిని తాను ఇప్పటి వరకు చూడలేదన్నాడు.
ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపవలసింది పోయి కేవలం తన స్వార్థం కోసమే చూసుకుంటున్నాడని ఆరోపించాడు. మిగతా వారికి రక్షణగా అతడు టాపార్డర్లో బ్యాటింగ్ చేయడానికి అసలు ఇష్టపడటం లేదన్నాడు. సొంత పరుగులతో సంతోషపడుతున్నాడని, జట్టుకు దిశా నిర్దేశనం చేసే వ్యూహాలు అతడి వద్ద లేవన్నాడు.
మరోవైపు యూనిస్ ఖాన్ పైన రమీజ్ రాజా మండిపడ్డారు. యూనిస్ ఖాన్ సేవల్ పాకిస్తాన్ క్రికెట్కు ఇక చాలునని ధ్వజమెత్తాడు. తాను యూనిస్ను ప్రాధేయపడుతున్నానని, ఇక వన్డే జట్టు నుండి తప్పుకోమని సూచించాడు.

పాక్ జట్టుకు అంత్యక్రియలు
ప్రపంచకప్లో వరుసగా రెండు మ్యాచులను చిత్తు అయిన పాక్ జట్టు పైన స్వదేశంలో అభిమానుల నుండి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విండీస్ చేతిలో పరాభవం అనంతరం పాక్ జట్టుకు ముల్తాన్లో అంత్యక్రియలు నిర్వహించారు. శవపేటిక పైన బ్యాట్లు ఉంచి నిరసన తెలిపారు. అభిమానులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.
కాగా, ఆండ్రీ రసెల్ ఆల్రౌండ్ ప్రతిభ వెస్టిండీస్ను గెలిపిస్తే, ఈసారి వరల్డ్ కప్లో పాకిస్తాన్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్ని చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కోల్పోయిన పాకిస్తాన్... శనివారం వెస్టిండీస్ను ఢీకొని 150 పరుగుల భారీ తేడాతో చిత్తయింది.
పాక్ పేలవమైన బౌలింగ్ను సునాయాసంగా ఎదుర్కొన్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 310 పరుగులు సాధించింది. ఆతర్వాత బౌలింగ్లోనూ పాక్ విఫలమైంది. 39 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. షోయబ్ మక్సూద్ (50), ఉమర్ అక్మల్ (59) అర్ధ సెంచరీలతో రాణించకపోతే, పాక్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.