హైదరాబాద్: 'నా ఫెయిల్యూర్సే నన్ను రాటుదేల్చాయి' ఐదు వన్డేల సిరిస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్న మాటలివి. తొలి వన్డేలో 90 బంతుల్లో 132 పరుగులతో నాటౌట్గా నిలిచిన ధావన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభం వరకూ శిఖర్ ధావన్పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. దీంతో దాదాపు ఆరు నెలల పాటు టీమిండియాకి ధావన్ దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో అద్భుతమైన ప్రదర్శనతో రాణించిన ధావన్.. గతంలో జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో ఓటముల నుంచి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపాడు.

'గతేడాది కివీస్తో జరిగిన సిరీస్లో నేను మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో జట్టులో నుంచి స్థానం కోల్పోవల్సి వచ్చింది. ఫామ్ కోల్పోయి భారత్ జట్టుకి దూరమైనప్పుడు చాలా బాధేసింది. అయితే.. పరుగులు చేయకపోవడం వల్లే కదా నన్ను పక్కన పెట్టారని తర్వాత అర్థం చేసుకున్నాను. నా బలహీనతలు సరిదిద్దుకుని బ్యాటింగ్పై దృష్టి కేంద్రీకరించాను' అని ధావన్ అన్నాడు.
'ఒకరకంగా చెప్పాలంటే.. నా ఫెయిల్యూర్సే నన్ను రాటుదేల్చాయి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఇప్పటికే వాటి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన సమయం నాకెంతో కఠినమైనది. ఇప్పుడు దాని నుంచి బయటికి వచ్చేశాను కాబట్టి మరోసారి ఆలోచించాలని అనుకోవట్లేదు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్పై సెంచరీ సాధించాను' అని తెలిపాడు.

'అప్పుడు ఏ ఫామ్లో ఆడానో ఇప్పుడు అదే ఫామ్లో ఆడుతున్నా. ప్రస్తుతం ఉన్న ఫామ్ని ఇలానే కొనసాగించాలని ఆశిస్తున్నా. 2019లో ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా ఎంతో సమయం ఉంది. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేయాలన్నది నా లక్ష్యం. ఒకవేళ నేను సరిగా ఆడలేకపోతే.. నా స్థానంలోకి మరొకరు వస్తారు. కాబట్టి ఫామ్తో పాటు ఫిటెనెస్పైన దృష్టి పెట్టాను' అని ధావన్ వెల్లడించాడు.
'తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ల ఆరంభాన్ని చూసి ఆ జట్టు 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించా, కానీ స్వల్ప విరామంలో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. మరిన్ని మ్యాచ్ల ద్వారా వారు త్వరలోనే అనుభవం సంపాదిస్తారు. ఫెర్నాండో బౌలింగ్ ప్రదర్శనపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. అతనో మంచి బౌలర్. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతన్ని ఎదుర్కొన్నాను' అని ధావన్ వెల్లడించాడు.
రెండో వన్డే పల్లెకలె వేదికగా ఆగస్టు 24 (గురువారం)నాడు జరగనుంది.