
హైదరాబాద్: ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ తన బౌలింగ్లో సవాల్ విసురుతుంటే... టీమిండియా ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఏ విధంగా బౌలింగ్ చేస్తారో అలా వేసేందుకు ప్రయత్నిస్తానని అండర్-19 జట్టులో ప్రధాన పేసర్గా ఉన్న కమలేష్ నాగర్కోటి వెల్లడించాడు.
ఇటీవల న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో నాగర్కోటి అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంతిని గంటకి 149 కిలోమీటర్ల వేగంతో విసిరి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అండర్-19 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని సొంత చేసుకున్న భారత్ సోమవారం స్వదేశానికి తిరిగి చేరుకుంది.
ఈ సందర్భంగా కమలేష్ నాగర్కోటి మీడియాతో మాట్లాడుతూ 'బౌలింగ్ సమయంలో నాకేదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీల బౌలింగ్ని గుర్తు చేసుకుంటా. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వారిలా బౌలింగ్ చేసి విజయాన్ని అందించాలని కోరుకుంటాను' అని తెలిపాడు.
ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పరుగులు రాబడుతుంటే.. వారిని నియంత్రించేందుకు వారు అవలంబించే విధానాల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తా. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఎలా బౌలింగ్ చేస్తున్నారో గమనిస్తాను. అయితే.. ఇప్పటి వరకు ఆ ఇద్దరు పేసర్లని నేను కలవలేదు. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా' అని నాగర్కోటి తెలిపాడు.
'వారితో కలిసి బౌలింగ్ మెళకువల గురించి చర్చిస్తా. ప్రస్తుతం ఇప్పుడు నా దృష్టి అంతా విజయ్ హజారే ట్రోఫీపైనే. ఈ టోర్నీలో రాణిస్తే.. ఐపీఎల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చు. వేగంగా బంతులేసుకుంటూ వెళ్లాలనుకోవట్లేదు.. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాను' అని అన్నాడు.
యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన టోర్నమెంట్ ఐపీఎల్. గంటకి 160 కిమీ వేగంతో బంతులు విసిరినా.. లైన్ అండ్ లెంగ్త్లో విసరలేకపోతే ఫలితం ఉండదు. అందుకే నా వరకు 150 కిమీ వేగంతో లయబద్ధంగా బౌలింగ్ చేయాలని ఆశిస్తున్నా' అని నాగర్కోటి అన్నాడు.
ఇటీవల ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో కమలేష్ నాగర్కోటిని రూ. 3.2 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.