తనపై వస్తున్న విమర్శలకు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. డబ్బు కోసమే క్రికెట్ ఆడుతున్నాడంటూ తనని ఆరోపిస్తున్న విమర్శకులకు అర్థమయ్యేలా హార్దిక్ వివరణ ఇచ్చాడు. గాయంతో టీమిండియాకు హార్దిక్ దాదాపు అయిదు నెలలు దూరమైన విషయం తెలిసిందే.
గతేడాది అక్టోబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో హార్దిక్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో బంతిని ఆపే క్రమంలో అదుపుతప్పడంతో హార్దిక్ చీలమండకు గాయమైంది. అతడు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో తిరిగి పోటీ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్తో తాను సూపర్ ఫామ్లో ఉన్నానని ప్రపంచానికి చాటిచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు.

అయితే ప్రపంచకప్ అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ దేశాలతో సిరీస్లు జరిగినప్పటికీ హార్దిక్ రీఎంట్రీ ఇవ్వలేదని, నీఛంగా డబ్బు కోసం ఐపీఎల్ ఆడటానికి రెడీ అయ్యాడని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై హార్దిక్ వివరణ ఇచ్చాడు. ఐపీఎల్ కంటే ముందు టీమిండియా తరఫున ఎందుకు ఆడలేదనే విషయంపై స్పష్టత ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొనే ఇన్ని రోజులు బరిలోకి దిగలేదని హార్దిక్ తెలిపాడు. అందుకే సుదీర్ఘ విరామం తీసుకున్నాని, ఐపీఎల్ కోసం కాదని పేర్కొన్నాడు. ''ఐపీఎల్ కోసం నేను సుదీర్ఘ విరామం తీసుకోలేదు. ఐపీఎల్ తర్వాత ఓ మెగా టోర్నీ మళ్లీ వస్తుంది. అదే టీ20 వరల్డ్ కప్. ప్రపంచకప్ను నా బిడ్డలా భావిస్తాను. అందుకే గ్యాప్ తీసుకున్నాను'' అని హార్దిక్ అన్నాడు.
కాగా, గుజరాత్ టైటాన్స్ను రెండు సార్లు ఫైనల్కు చేర్చిన హార్దిక్ ట్రేడింగ్లో ముంబై ఇండియన్స్కు వెళ్లాడు. అంతేగాక సారథి బాధ్యతలు అందుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలను అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ అయిదు టైటిళ్లు గెలిచి విజయవంతమైన కెప్టెన్గా ఉన్నాడు. కానీ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని హార్దిక్ వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.
2021లో గుజరాత్ను ఛాంపియన్ నిలిపిన హార్దిక్కు ముంబై పగ్గాలు అందివ్వడంలో తప్పులేదని కొందరు మద్దతు ఇచ్చారు. టీమిండియాను నడిపించే రోహిత్ను ముంబై కెప్టెన్గా మరికొన్ని సీజన్లు కొనసాగించాల్సిందని మరికొందరు తమ వాదన వినిపించారు.