
గెలవాల్సిన మ్యాచ్..
ఈ టోర్నమెంట్ రేస్లో నిల్చోవాలంటే ఈ సాయంత్రం జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆస్ట్రేలియా. పెర్త్లో షెడ్యూల్ అయిన ఈ మ్యాచ్లో శ్రీలంకను ఓడించాల్సి ఉంటుంది. వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ, ధనంజయ డిసిల్వా వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టులో ఆస్ట్రేలియా కంటే మెరుగైన బౌలర్లు ఉన్నారు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ జోష్ హేజిల్వుడ్ బౌలర్లు ఉన్నప్పటికీ- న్యూజిలాండ్పై గెలవలేకపోయింది.

లంకతో మ్యాచ్కు ముందు..
శ్రీలంకపై మ్యాచ్ గెలిచి తీరాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ట్రబుల్స్లో పడింది. ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా శ్రీలంకతో మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తోన్నట్లు జట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో అతను బాధపడుతున్నట్లు పేర్కొంది. ఆడమ్ జంపాకు రాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించామని తెలిపింది. అతనికి కరోనా సోకినట్లు నిర్ధారించింది.

మరొకటి ఉండదు..
ఈ పరిస్థితుల మధ్య ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిఛెల్ మార్ష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ 2022ను ఇక్కడితో ఆపేయడం మంచిదంటూ చెప్పాడు. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పతాక స్థాయికి చేరుకుందని, అంతకుమించి మరో మ్యాచ్ను ఈ టోర్నమెంట్లో చూడలేమని పేర్కొన్నాడు. దీన్ని మించిన థ్రిల్లింగ్ మ్యాచ్ మరొకటి ఉండబోదని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ నుంచి మధ్యలో వైదొలగి వెళ్లే పరిస్థితులు తమకు లేదని, ఈ మూడు వారాల పాటు గేమ్లో ఉంటామని వివరించాడు.

ఎప్పుడూ ఓ అద్భుతమే..
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఓ అద్భుతమేనని, కోట్లాదిమంది ప్రజలు, అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని మిఛెల్ మార్ష్ ప్రశంసించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ సాధారణ ప్రేక్షకుడిలా తాను ఈ మ్యాచ్ను చూశానని, ఈ రెండింట్లో ఏదో ఒక జట్టులో తాను భాగస్వామిగా ఉండి ఉంటే బాగుండేదని అనిపించిందని పేర్కొన్నాడు. టీమిండియా బ్యాక్బోన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను ప్రత్యేకంగా ప్రస్తావించాడు మిఛెల్ మార్ష్.

కోహ్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్..
భారత్-పాక్ మ్యాచ్లో నిస్సందేహంగా విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనను చేశాడని మార్ష్ ప్రశంసలు కురిపించాడు. ఓడిపోయే దశలో ఉన్న జట్టును అతను ఒంటిచేత్తో గెలిపించాడని, అసాధారణ రీతిలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కొనసాగిందని అన్నాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో ఉన్న జట్టును 160 పరుగులకు చేర్చడంలో విరాట్ కోహ్లీ చూపిన తెగువ, దూకుడు మరో బ్యాటర్లో కనిపించకపోవచ్చని మిఛెల్ మార్ష్ కితాబిచ్చాడు.

గడ్డు పరిస్థితుల నుంచి..
విరాట్ కోహ్లీ సుమారుగా సంవత్సరం పాటు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడని, కేరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను అధిగమించాడని మిఛెల్ మార్ష్ గుర్తుచేశాడు. అలాంటి దశ నుంచి తన జట్టును గెలిపించడాన్ని ఓ అద్భుతంగా అభివర్ణించాడతను. అదొక అద్భుతమైన ఇన్నింగ్ అని పేర్కొన్నాడు. కోహ్లీ తన బ్యాటింగ్లో నమ్మశక్యం కాని షాట్లు ఆడాడని, అలాంటివి మరిన్ని అతని నుంచి ఆశించవచ్చని అన్నాడు.


Click it and Unblock the Notifications
