బీసీసీఐ మంచి పని చేసింది:
ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మ మాట్లాడిన వ్యాఖ్యలను షేర్ చేసింది. ఈ వీడియోలో రోహిత్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్ మిల్నే, జయంత్ యాదవ్, షేన్ బాండ్, రాబిన్ సింగ్ కూడా ఉన్నారు. 'ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఐపీఎల్ 2021ని రద్దు చేసి బీసీసీఐ మంచి పని చేసింది. దేశం మొత్తం కరోనాతో అతలాకుతులమవుతున్న సమయంలో ఐపీఎల్ ద్వారా కాస్త ఉపశమనం కలిగిద్దాం అని భావించాం. దురదృష్టవశాత్తూ బయో బబూల్ సెక్యూర్లో ఉన్న మాకు కూడా కరోనా సెగ తగిలింది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుంటే.. లీగ్ నిర్వహించడం కష్టతరమవుతుంది. ఇలాంటి సమయంలో లీగ్ను వాయిదా లేదా రద్దు చేయడమే సరైన పని. బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది' అని రోహిత్ అన్నాడు.
స్టే హోమ్.. స్టే సేఫ్:
'ఐపీఎల్ 2021లో ఇంతవరకు జరిగిన మ్యాచ్లకు మీరు ఇచ్చిన సహకారం మరువలేనిది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్ను నిర్వహిస్తారని ఆశిస్తున్నా. మనం మళ్లీ కలిసేవరకు దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. మనమంతా ఒక ఫ్యామిలీలా ఉండి దేశాన్ని కరోనా సంక్షోభం నుంచి తప్పిద్దాం. స్టే హోమ్.. స్టే సేఫ్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్' అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లాడి 4 విజయాలు.. 3 ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీఎస్కే నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ముంబై సత్తా చాటింది. పొలార్డ్ ఒంటిచేత్తో ముంబైకి విజయాన్ని అందించడం ఈ సీజన్లో హైలెట్.
పలువురు ఆటగాళ్లు కొవిడ్ బారినపడడంతో:
దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరిగిపోతుండడం, పలువురు ఆటగాళ్లు కొవిడ్ బారినపడడంతో ఐపీఎల్ 2021ను బీసీసీఐ వాయిదా వేసింది. కోల్కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్.. ఢిల్లీ ఆటగాడు అమిత్ మిశ్రా.. హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాలు కరోనా బారినపడడంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ఈ నెల 4న బీసీసీఐ ప్రకటించింది. అలాగే చెన్నై సపోర్ట్ స్టాఫ్లోని మైక్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీ కూడా కరోనా బారనపడ్డారు.
మలిదశ ఎప్పుడు:
నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021ను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న చర్చ మొదలైంది. సీజన్ మలిదశ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇతర దేశాల క్రికెట్ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. యూఏఈ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఏదో ఒక చోటికి వేదికను మార్చాలని అనుకుంటున్నట్టు సమాచారం.