సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ టీమిండియాకు దూరమై దాదాపు ఏడాది దాటింది. చివరిగా 2022లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ ఆడాడు. అయితే రెగ్యులర్ జట్టులో చోటు కోల్పోయనప్పటికీ ఆసియన్ గేమ్స్లో తనని ఎంపిక చేస్తారని భావించానని ధావన్ పేర్కొన్నాడు. గతేడాది అక్టోబర్లో జరిగిన ఆసియన్ గేమ్స్లో క్రికెట్ విభాగంలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
''ఆసియన్ గేమ్స్కు ప్రకటించిన జట్టులో నా పేరు లేకపోవడం షాకింగ్గా అనిపించింది. అయితే సెలక్టర్లు ఆలోచనలు భిన్నంగా ఉంటాయనుకున్నా. వాటిని మనం అంగీకరించాలి. నా భవిష్యత్ గురించి ఏ సెలక్టర్తోనే నేను మాట్లాడలేదు. ఎన్సీఏకి క్రమం తప్పకుండా వెళ్తున్నాను. ఎన్సీఏ నా కెరీర్కు ఎంతో సాయపడింది'' అని ధావన్ అన్నాడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ తక్కవ కాలంలోనే స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. రోహిత్ శర్మతో కలిసి రికార్డు భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

రోహిత్తో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యం గురించి ధావన్ మాట్లాడుతూ ''పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ తరపున విజయవంతమైన జోడీగా నేను-రోహిత్ నిలిచాం. రోహిత్ సహకారంతో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాను. టాప్ ఆర్డర్ సత్తాచాటితేనే ఛేదనకు, భారీ స్కోర్లకు ఆస్కారం ఉంటుంది. అయితే క్రెడిట్ రోహిత్కే ఇవ్వాలి. అతడు నాకెంతో మద్దతు ఇచ్చాడు''
''మేం ఇద్దరం కలిసి సుమారు 6వేల పరుగులు చేశాం. 19 సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. 2019లో మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మేం సాధించిన 193 పరుగులు భాగస్వామ్యం, అలాగే 2018 ఆసియాకప్లో 210 పరుగుల భాగస్వామ్యం మా అత్యుత్తమ ఇన్నింగ్స్లుగా భావిస్తాను.'' అని ధావన్ పేర్కొన్నాడు.
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లిని ధావన్ ప్రశంసించాడు. ప్రతి క్రికెటర్ వారిద్దరిలా కావాలని కోరుకుంటారని అన్నాడు. ఇద్దరూ అత్యుత్తమ కెప్టన్లు అని, అయితే ధోనీ కూల్గా, విరాట్ ఎనర్జిటిక్గా జట్టును నడిపిస్తారని చెప్పాడు. 38 ఏళ్ల ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు.