హైదరాబాద్: బీసీసీఐ పరిపాలకుల కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న వినోద్ రాయ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. వయసు దాటిపోయినా ఇంకా అదే పదవిలో ఎలా కొనసాగుతారు.? అని ప్రశ్నిస్తున్నారు. లోధా కమిటి చేసిన సూచనల ప్రకారం.. 70 ఏళ్లు వయో పరమితి దాటిన వాళ్లంతా ఆ పదవికి అనర్హులు. ఈ క్రమంలో వినోద్ రాయ్ గురువారం నాటికి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో.. బోర్డులో సంస్కరణలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పరిపాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్పై చర్చ మొదలైంది. పరిమితి దాటినా ఎలా కొనసాగగలడనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.
'ఇప్పుడు వినోద్ రాయ్కి 70 ఏళ్లు నిండాయి. ఇప్పుడు కూడా అతడు బోర్డు సమావేశాలకు హాజరవుతాడా? లేదా బీపీసీని పాలిస్తున్నందున, సుప్రీంకోర్టు నియమించినందున సీఓఏ సభ్యులకు నిబంధనలేమైనా భిన్నంగా ఉంటాయా?' అని నిరంజన్ షా అన్నాడు. వయోపరిమితి నిబంధన కారణంగా బీసీసీఐలో పదవులు చేపట్టకుండా అనర్హుడైన తొలి వ్యక్తి షానే కావడం గమనార్హం.
బోర్డుకు చెందిన మరో సభ్యుడొకరు సీఓఏ ద్వంద్వ ప్రమాణాలు ఎత్తిచూపుతూ ఏకంగా రాయ్కు సందేశం పంపినట్టు సమాచారం. ఈ సందర్భంగా..ఏప్రిల్ 20న రాయ్ రాసిన లేఖను సదరు సభ్యుడు తన సందేశానికి జత చేసినట్టు పంపాడట. జాతీయ క్రికెట్ అకాడమీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దానికి 70 ఏళ్లుదాటిన వారిని అనుమతించకూడదని ఏప్రిల్ 20న బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధురికి వినోద్ రాయ్ సూచించడమే ఆ లేఖ సారాంశం.
70 ఏళ్ల వయోపరిమితి విధించిన మరునాడే ముంబై క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నానని శరద్ పవార్ అన్నాడు. దశల వారీగా తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ను వృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలోని పలు చోట్ల క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి మంచి ఆటగాళ్లను తయారుచేస్తున్నామన్నారు.