హైదరాబాద్: స్వదేశంలో కాకుండా విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందే కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటానని టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. ఈ ప్రణాళికలో కేవలం క్రికెట్కు మాత్రమే పరిమితం కాకుండా పర్యటించే దేశం గురించి కూడా తెలుసుకుంటానని వివరించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు కీలకంగా నిలిచిన బుమ్రా గాయం కారణంగా ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్కు అందుబాటులో లేడు. టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.
'నేనెప్పుడూ టెస్టు క్రికెట్ ఆడాలని కోరుకుంటాను. దక్షిణాఫ్రికా సిరీస్లో తుది జట్టులో చోటు దక్కినందుకు సంతోషించాం. నా ఆరంభమూ బాగుంది. నన్నడిగితే టెస్టు క్రికెట్కే అత్యధిక రేటింగ్ ఇస్తాను. ఆడుతున్న కొద్దీ నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతూ ఉంటుంది. అది ఇతర ఫార్మాట్లలోనూ ప్రతిబింబిస్తుంది' అని బుమ్రా అన్నాడు.
'పర్యాటక దేశాన్ని ఆస్వాదించాలి. అక్కడి ప్రాంతాలను వీక్షించాలి. అలాగైతేనే అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోగలం. పర్యటనను ఆస్వాదించగలం. ఇది తర్వాత మన ప్రదర్శనలో ప్రతిబింబిస్తుంది' అని బుమ్రా తెలిపాడు.
'నేను ఏ దేశానికి వెళ్లినా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను. పర్యటించడానికి ముందే దేశం గురించి కొన్ని వీడియోలు చూస్తాను. అక్కడ ఏది పనిచేస్తుంది, ఆతిథ్య జట్టు ఏం సాధించిందో తెలుసుకుంటాను. సుదీర్ఘ విదేశీ పర్యటనల్లో ఆతిథ్య దేశంలో హాయిగా ఉండాలంటే ఇదెంతో కీలకం' అని బుమ్రా పేర్కొన్నాడు.