ముంబై: సాక్షి ప్రసవ సమయంలో ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ దగ్గర లేకపోవడం పెద్ద విషయం కాదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సతీమణి డోనా గంగూలీ అన్నారు. డోనా 2001లో అమ్మాయికి జన్మనిచ్చినప్పుడు సౌరవ్ గంగూలీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ప్రస్తుతం ధోనీ ప్రపంచ కప్ పోటీల కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. దీంతో సాక్షి బిడ్డను ప్రసవించే సమయంలో పక్కన లేడు.
పుట్టగానే బిడ్డ తండ్రిని గుర్తించలేదని, అందువల్ల ఇప్పుడు పక్కన లేకపోవడం వల్ల పెద్ద సమస్య ఉండదని డోనా అన్నారు. ఈ సమయంలో పాపకు కావాల్సింది తల్లి అని ఆమె అన్నారు. తనకు కూతురు పుట్టినప్పుడు తన పక్కన గంగూలీ లేడని, ఆ సమయంలో దేశం కోసం క్రికెట్ ఆడుతున్నాడని ఆమె అన్నారు.
తనకు పాప పుట్టిన విషయం తనకన్నా ముందే గంగూలీకి తెలిసిందని, తాను శస్త్రచికిత్స జరగడంతో కొద్ది గంటల పాటు స్పృహలో లేనని, తాను స్పృహలోకి వచ్చేలోగా గంగూలీకి ఆ విషయం తెలిసిందని, తన పక్కన తన బంధువులున్నారని, దాంతో ఎంతో సంతోషం వేసిందని ఆమె అన్నారు.
గంగూలీ నెలకు పైగా రోజుల తర్వాతనే పాపను చూశాడని, ధోనీకీ సాక్షికీ తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. మార్చి 29వ తేదీన భారత్ పైనల్ ఆడుతుందనే ఆశాభావం తనకు ఉందని ఆమె అన్నారు. భారత్ ఫైనల్కు చేరుకుంటే తన పాపను చూడడానికి ధోనీకి 50 రోజులకు పైగా పడుతుంది.