హైదరాబాద్: టీమిండియా ఇంగ్లాండ్తో ఆడుతోన్న తొలి టెస్టు రెండో రోజు ప్రదర్శనకు సంతృప్తి వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. ఒకానొక దశలో భారత్ స్కోరు 150కూడా సందేహమేననుకున్న దశలో కోహ్లీ తానొక్కడై 149 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై తొలి సెంచరీ నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రిపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన కోహ్లీ.. 'జట్టుకు తనవంతు సహకారం అందించాలనే ప్రిపేర్ అయ్యా. అది కేవలం మూడంకెల మార్కు కోసం కాకుండా జట్టు విజయమే లక్ష్యంగా సిద్దమైయ్యా. అయితే అనుకున్న లక్ష్యం చేరకుండానే వికెట్ సమర్పించుకోవడంతో కొంత నిరాశకు గురయ్యా. నిజానికి 10 నుంచి 15 పరుగుల ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఆడాను. కానీ కుదరలేదు. ఇక నా ప్రిపరేషన్ పట్ల సంతోషంగా ఉన్నా.. ఎవరేమనుకున్నా నాకవసరం లేదు.' అని తెలిపాడు.
టెయిలెండర్లతో రాణించడంపై స్పందిస్తూ.. 'టెయిలండర్లతో పరుగులు రాబట్టడం ఒత్తిడితో కూడుకున్నపనే. కానీ ఆ క్లిష్ట సమయంలో కష్టమైన పరిస్థితులను కూడా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. దాన్ని ఓ సవాల్గా తీసుకుని ఇన్నింగ్స్ను ముందుకు నడిపించా. ఈ పరిస్థితి మానసిక బలానికి పరీక్షే. కానీ ప్రత్యర్థీ స్కోర్ను సమీపించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగాను. దీనికి టెయిలండర్లు మద్దతిచ్చారు.'
'వారిలో ముఖ్యంగా ఐదు వికెట్ల అనంతరం వచ్చిన హార్ధిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. అలాగే ఇషాంత్, ఉమేశ్ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. వారి నుంచి ఇదొక గొప్ప ప్రదర్శన. వారి ప్రదర్శన పట్ల గర్వంగా భావిస్తున్నా. వారి వల్లే ఇది సాధ్యమైంది. మేం ఇక్కడికి గట్టి పోటినివ్వడానికి వచ్చాం. ఈ పోరాటాన్ని ఇలానే కొనసాగిస్తాం.' అని కోహ్లి పేర్కొన్నాడు. తొలి టెస్టులో 54 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. అద్భుతంగా రాణించి చివరికి టెయిలండర్లతో కూడా పరుగులు తీయించి జట్టును గట్టెక్కించాడు.