నాకు కూడా రెస్ట్ కావాలి
'నాకు కూడా రెస్ట్ కావాలి.. నేనేమీ రోబోను కాదు.. నా చర్మాన్ని కోస్తే రక్తమే వస్తుంది. నాకు అవసరమైనప్పుడు విశ్రాంతి అడుగుతా. ఓ ప్లేయర్ ఎంత పని భారాన్ని మోస్తున్నాడన్నదానిపై రెస్ట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. అది ఒక్కో ప్లేయర్కు ఒక్కోలా ఉంటుంది' అని కోహ్లీ అన్నాడు. అసలు కోహ్లీ నోటి వెంట ఈ సమాధానం ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా! ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఎందుకు అన్న ప్రశ్నపై కోహ్లీ పైవిధంగా స్పందించాడు. తన ఫిట్నెస్ను మళ్లీ మెరుగుపరుచుకునేందుకు పాండ్యాకు రెస్ట్ కోరాడని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు.
చాలా క్రికెట్ ఆడుతున్నాం
'చాలా క్రికెట్ ఆడుతున్నాం. అలాంటప్పుడు మన ప్రిపరేషన్లో ఎంత నాణ్యత ఉందో చూసుకోవాలి. ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదని పాండ్యా అన్నాడు. దీంతో పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నా. ప్రతి క్రికెటర్ ఏడాదిలో 40 మ్యాచ్లు మాత్రమే ఆడగలడు. అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడితే అతడికి విశ్రాంతి అవసరమే' అని కోహ్లీ అన్నాడు. 'ఈ నేపథ్యంలోనే పాండ్యాకు కాస్త విశ్రాంతి ఇచ్చాం. పని భారం ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే.. నేను కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడాను. నాకు కూడా ప్రస్తుతం కాస్త విరామం కావాలి' అని కోహ్లీ అన్నాడు.
లంకతో సిరీస్ను మేం తేలికగా తీసుకోవడం లేదు
'అయితే లంకతో సిరీస్ను మేం తేలికగా తీసుకోవడం లేదు. అందుకే ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమని భావించి ఈ సిరీస్ నుంచి నేను తప్పుకోలేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడటం నేర్చుకుంటేనే విజయం సాధిస్తాం. ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ ముఖ్యమే. ఒకవేళ మేం ఈ సిరీస్ ఓడిపోతే మీడియా మమ్మల్ని వదలదు' అని కోహ్లీ తెలిపాడు.
లంకతో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లు ఆడుతుండటంపై
శ్రీలంకతో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లు ఆడుతుండటంపై కూడా కోహ్లీ స్పందించాడు. 'ఫ్యాన్స్ బోర్ ఫీలవడాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని, వాళ్లను కోల్పోవడం తమకు ఇష్టం లేదు' అని కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉంటే తొలి టెస్ట్కు ఆతిథ్యమిస్తున్న కోల్కతాలో వర్షం పడుతుండటంతో బుధవారం రెండు జట్లు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాయి. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు.