
హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభమైంది. తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో గురువారం జరిగిన ఆటలో కేవలం 17.5 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది.
దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్లా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ పాకిస్థాన్ జర్నలిస్టుల ప్రశ్నలు డిక్వెల్తో పాటు అక్కడున్న మిగతా వారందరినీ నవ్వులు తెప్పించాయి.
"ఈ రోజు మీరు బాగా ఆడారు డిసిల్వా" అని పాక్ జర్నలిస్ట్ ప్రస్తావించగా ఇందుకు చిరునవ్వులు చిందించి "నేను డిక్వెల్లాని, డిసిల్వాని కాదు" అని డిక్వెల్లా సమాధానమిచ్చాడు. అయితే, ఆ తర్వాత మరోసారి పొరబడి "ఈ పిచ్పై మీరు ఎంతో బాగా ఆడారు. సెంచరీ సాధిస్తారా?" అని అడిగాడు.
"మీరు నా గురించేనా మాట్లాడేది. నేను డిక్వెల్లాని, డిసిల్వాని కాదు. ఇప్పటికే ఔటై పెవిలియన్లో కూర్చున్నాను. ఒకవేళ రెండో ఇన్నింగ్స్లో వీలైతే సెంచరీ గురించి ఆలోచిస్తా" అని సరదాగా సమాధనమిచ్చాడు. దీంతో వెంటనే అక్కడి వారంతా నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలో మ్యాచ్ వివరాలు, ఆటగాడి పేరు కూడా తెలుసుకోకుండా విలేకర్ల సమావేశానికి ఎలా వస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. డిసిల్వా (72 నాటౌట్), కరుణరత్నె (59) హాఫ్ సెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లలో షాహీన్, నసీమ్ చెరో రెండు వికెట్లు తీశారు.