టీమిండియా బ్యాటర్, ఆంధ్ర జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న రాజకీయ నాయకుడి కొడుకుపై అరిచాననే కారణంతో తనని సారథి బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు. అంతేగాక ఇక జీవితంలో మళ్లీ ఆంధ్ర జట్టు తరఫున ఆడనని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో క్వార్టల్ ఫైనల్లో ఇవాళ మధ్యప్రదేశ్ చేతిలో నాలుగు పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు ఓటమి అనంతరం.. విహారి ఇన్స్టాగ్రామ్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో ఆంధ్ర కెప్టెన్గా విహారి బరిలోకి దిగాడు. కానీ బెంగాల్తో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్నాడు. బ్యాటర్గా జట్టులో కొనసాగాడు. అయితే రాజకీయ నాయకుడి ఒత్తిడి కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ (ACA) తనపై వేటు వేసిందని విహారి తాజాగాఆరోపణలు చేశాడు.

''బెంగాల్తో జరిగిన తొలి మ్యాచ్లో కెప్టెన్గా ఉన్నాను. ఆ మ్యాచ్లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అతడు తన తండ్రి (రాజకీయ నాయుకుడు)కి ఫిర్యాదు చేశాడు. ఆ ప్లేయర్ తండ్రి.. నాపై వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అసోషియేషన్ను కోరాడు. దాంతో గతేడాది ఫైనల్కు చేరిన బెంగాల్పై 410 పరుగుల ఛేదన చేసినప్పటికీ.. నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అడిగారు''
''ఆ సదరు ప్లేయర్ను వ్యక్తిగతంగా నేను ఏమీ అనలేదు. కానీ అసోషియేషన్ అతడికి ప్రాధాన్యత ఇచ్చింది. గతేడాదిలో గాయంతో కూడా ఎడమచేతితో బ్యాటింగ్ చేసిన వ్యక్తి కంటే.. గత ఏడేళ్లలో అయిదుసార్లు ఆంధ్రను గెలిపించిన అతడి కంటే.. భారత్ తరఫున 16 టెస్టులు ఆడిన ఆటగాడి కంటే.. ఆ సదరు ప్లేయర్ వైపే అసోషియేషన్ మొగ్గు చూపింది. ఈ విషయం నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆటపై, జట్టుపై ఉన్న ప్రేమతో ఈ సీజన్ను కొనసాగించాను''
''విచారకర విషయం ఏంటంటే.. అసోషియేషన్ చెప్పినట్లుగానే ఆటగాళ్లు నడుచుకోవాలని, వాళ్ల వల్లే మేం ఉన్నామని భావిస్తున్నారు. అందుకే ఆత్మగౌరవం కోల్పోయిన ఆంధ్ర జట్టుకు ఇంకెప్పుడూ ఆడకూడదని నిర్ణయించుకున్నా. ఐ లవ్ ది టీమ్. ప్రతి సీజన్లో ఎదుగుతున్న ఆ జట్టు అంటే నాకెంతో ప్రేమ. కానీ జట్టు ఎదగాలని అసోషియేషన్ కోరుకోవట్లేదు'' అని హనుమ విహారి పేర్కొన్నాడు.
గతేడాది మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయపడి కూడా విహారి బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. తన కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేయడానికి వీలు లేకపోవడంతో లెఫ్ట్ హ్యాండర్ మారి జట్టు కోసం పోరాడాడు. అయితే 2023-24 రంజీ సీజన్ ప్రారంభానికి ముందు హనుమ విహారి మధ్యప్రదేశ్ జట్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ దానికి నిరాకరించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో ఈ సీజన్లో ఆంధ్ర జట్టు తరఫున విహారి కొనసాగాడు.
కాగా, ఇవాళ మధ్యప్రదేశ్ జరిగిన క్వార్టర్ ఫైనల్ ఛేజింగ్లో విహారినే టాప్ స్కోరర్. 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఆంధ్ర 164 పరుగులకు కుప్పకూలింది. విహారి 136 బంతుల్లో 55 పరుగులు చేశాడు.