హైదరాబాద్: ఆటలో ఎదురయ్యే సవాళ్లంటే ఎంతో ఇష్టమని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. బుధవారం తన భార్య రీవా సోలంకీతో కలిసి ముంబైలో రవీంద్ర జడేజా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
'సవాళ్లు ఎదురైపుడు వాటిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేయడాన్ని ఇష్టపడతా. అనుకూలంగా ఉన్న పిచ్లపై సులువుగా ఆడేయడంలో పెద్ద వినోదం ఏమీ ఉండదు. కఠినమైన పరిస్థితుల్లో.. క్లిష్టమైన పిచ్లపై పోరాడి మెరుగైన ప్రదర్శన చేస్తే ఆ ఆనందమే వేరు' అని జడేజా చెప్పాడు.

మరోవైపు టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్, విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్గా రాహుల్ ద్రవిడ్ను నియమించడాన్ని జడేజా స్వాగతించాడు. వారి అనుభవాలు జట్టుకు ఎంతో మేలు చేస్తుందని, వారి వద్ద నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని తెలిపాడు.
కాగా, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జులై 26 నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. లంక పర్యటనలో ఆతిథ్య జట్టులో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కూడిన సిరిస్ ఆడనుంది. లంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో జడేజా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.