ఐపీఎల్ -2009 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమికి గల కారణాలను అనిల్ కుంబ్లే వివరించాడు. ఆ రెండో సీజన్లో ఆర్సీబీకి కుంబ్లే సారథిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కెప్టెన్గానే కాకుండా స్పిన్నర్గానూ కుంబ్లే సత్తాచాటాడు. డెక్కన్ ఛార్జర్స్తో జరిగిన ఫైనల్లో నాలుగు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.
కుంబ్లే ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 143 పరుగులు చేసింది. గిబ్స్ (53) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసి ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఛేజింగ్ ఆఖర్లో తనకి స్ట్రైకింగ్ ఇవ్వమని రాబిన్ ఉతప్పని వేడుకున్నాని కుంబ్లే తెలిపాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడిని ఉతప్ప 15 బంతుల్లో అజేయంగా 17 పరుగులు చేశాడు.

''2009 ఫైనల్ విషయాలు ఇంకా గుర్తున్నాయి. మేం ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నాం. వైడ్స్, నోబాల్స్ వేశాం. ప్రవీణ్ కుమార్ అయిదు వైడ్లు వేశాడు. అయినప్పటికీ 143 పరుగుల స్కోరును మేం ఛేదించవచ్చు. అయితే రాబిన్ ఉతప్పతో ఇప్పటికీ 'ఉతప్ప నువ్వు సిక్సర్ సాధించాల్సింది' అని అంటుంటాను. కనీసం నాకు స్ట్రైకింగ్ ఇవ్వాల్సిందని చెబుతుంటాను''
''ఆ సమయంలో స్కూప్ షాట్ ఆడొద్దని ఉతప్పను వేడుకున్నాను. ఆఖరి ఓవర్ ఆర్పీ సింగ్ బౌలింగ్ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతిని ఉతప్ప స్పూప్కు ప్రయత్నించాడు. 'ఉతప్ప.. నువ్వు స్కూప్ ఆడేలా ఆర్పీ అవకాశం ఇవ్వడు. స్లాగ్ షాట్ ఆడేలా ట్రై చేయి' అని చెప్పాను. మూడో బంతికి కూడా ఉతప్ప అలానే చేశాడు. ఇక చాలు అని చెప్పాను''
''నాకు అయినా స్ట్రైకింగ్ ఇవ్వమని అన్నాను. నేనైనా స్లాగ్ చేస్తే ఏదైనా జరగొచ్చని భావించాను. కానీ దురదృష్టవశాత్తు మేం ఆరు పరుగుల తేడాతో ఓడిపోయాం. కప్ను చేజార్చుకున్నాం'' అని కుంబ్లే పేర్కొన్నాడు. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా తొమ్మిది పరుగులే చేసింది.