
హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది.
అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ నిబంధనపై ఆస్ట్రేలియా స్పిన్ లెజండ్ షేన్ వార్న్ కూడా స్పందించాడు. 2019 వరల్డ్కప్ విజేత విషయంలో నిర్ణయం స్పష్టంగా లేదని అన్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. "వరల్డ్కప్ ఫైనల్ అద్భుతంగా సాగింది. రెండు జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేశాయి. ఆ రెండ్లు జట్లకు కంగ్రాట్స్ చెబుతున్నా" అని ట్వీట్ చేశాడు.
"న్యూజిలాండ్ ప్రదర్శన అద్బుతం. ఒక సూపర్ ఓవర్ టై అయితే.. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు నిర్వహించాలని, దానితోనే స్పష్టమైన విజేత ఎవరో తెలుస్తుంది" అని షేన్ వార్న్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.