టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మరికొన్నేళ్లు ఆటలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు తప్పక ఉంటానని రోహిత్ అన్నాడు. అంతేగాక అన్నీ సహకరిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ సాధించం తన లక్ష్యమని పరోక్షంగా ప్రకటించాడు.
36 ఏళ్ల రోహిత్ శర్మ మరో నెలన్నర రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ ప్రపంచకప్లో భారత జట్టును నడిపించనున్నాడు. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత తన భవిష్యత్పై రోహిత్ కీలక నిర్ణయాలు తీసుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు గత కొంతకాలంగా చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పట్లో క్రికెట్కు గుడ్బై పలికే ఆలోచన లేదని హిట్మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు.

''ప్రస్తుతం రిటైర్మెంట్ గురించి ఆలోచనే లేదు. కానీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. ఇప్పుడు నేను బాగానే ఆడుతున్నాను. కాబట్టి మరికొన్నేళ్లు ఆడాలనుకుంటున్నాను. ఆ తర్వాత గురించి నాకు తెలియదు. వరల్ట్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 గెలవాలని ఉంది. భారత్ కచ్చితంగా సాధిస్తుందని భావిస్తున్నా'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ ఫైనల్లో ఓడి టైటిల్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమి గురించి రోహిత్ మాట్లాడుతూ.. తన దృష్టిలో వరల్డ్ కప్ అంటే వన్డే ప్రపంచకప్ అని అన్నాడు. దాన్ని చూస్తూనే పెరిగానని, అది సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. ఈ నేపథ్యంలో 2027 వన్డ్ వరల్డ్ కప్ వరకు రోహిత్ ఆటలో కొనసాగుతాడని తెలుస్తోంది. అయితే హిట్మ్యాన్కు అప్పటికీ దాదాపు 40 ఏళ్లు వస్తాయి. ఆ టైమ్ వరకు రోహిత్ ఫామ్, ఫిట్నెస్ కొనసాగిస్తాడా లేదా అనేది అసలు ప్రశ్న.
కాగా, ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న రోహిత్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయిదు మ్యాచ్ల్లో 38 సగటుతో 156 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతని అత్యధిక స్కోరు 49. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ను కాదని జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అందించిన సంగతి తెలిసిందే.