
హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ మృతిపై ఆ దేశ్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన ఖాదిర్ మృతి వార్త తెలుసుకుని షాక్కు గురైనట్లు ఇమ్రాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
"నేనొక మంచి స్నేహితున్ని కోల్పోయాను. దేశ క్రికెట్ అభ్యున్నతి ఖాదిర్ ఎంతో కృషి చేశాడు. అతనొక అద్భుతమైన క్రికెటర్. ఖాదిర్ మృతి విస్మయానికి గురి చేసింది. ఆయన ఆత్మను అల్లా ఆశీర్వదిస్తాడు. ఖాదిర్ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
కాగా, అబ్దుల్ ఖాదిర్ (64) ఇంట్లో ఉన్న సమయంలో ఖాదిర్కు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. లాహోర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పాక్ తరఫున 67 టెస్టులు ఆడిన ఖాదిర్ 32.80 సగటుతో 236 వికెట్లు పడగొట్టాడు.
ఇక, 104 వన్డేల్లో 132 వికెట్లు తీశాడు. కుంబ్లేలు, వార్న్లు లెగ్స్పిన్కు కేరాఫ్ అడ్రస్లుగా మారకముందు 80వ దశకంలో తన మణికట్టు మాయాజాలంతో ఖాదిర్ పాక్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఇక లెగ్స్పిన్ బౌలింగ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ గుగ్లీకి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు.
1987లో ఇంగ్లండ్పై ఒక ఇన్నింగ్స్లో ఖాదిర్ 56 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ తరఫున ఇప్పటికీ ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. 2009లో చీఫ్ సెలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో పాక్ జట్టు ఇంగ్లండ్లో జరిగిన టీ20 వరల్డ్క్పను కైవసం చేసుకోవడం విశేషం.