భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన క్రికెట్ లవర్స్కు సుపరిచితమే. స్టైలిష్ షాట్లతో పరుగుల వరద పారిస్తూ గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై భారత్ టెస్టు విజయాల్లో స్మృతిది ప్రధాన పాత్ర.
అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహించే ఫేమస్ ప్రోగ్రామ్ కౌన్ బనేగా కరోడ్పతికి స్మృతి మంధాన వెళ్లింది. తాను క్రికెటర్గా కావడానికి గల కారణాలు వివరించింది. అలాగే రైట్ హ్యాండర్ అయిన తాను లెఫ్ట్ హ్యాండర్గా ఎలా మారిందనే ఆసక్తికర విషయాలు ప్రోగ్రామ్లో పంచుకుంది.

'' మా నాన్న, నా సోదరుడు క్రికెటర్లు. అయితే క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే అవకాశం మా తండ్రికి దక్కలేదు. కాబట్టి తన పిల్లలను క్రికెటర్లను చేయాలని మా నాన్న నిర్ణయించుకున్నాడు. ఒకరినైనా దేశం తరపున టీమిండియాలో చూడాలనుకున్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ గురించి విన్నాను''
'' మా బ్రదర్తో కలిసి ప్రాక్టీస్కు వెళ్లేదానిని. అతడికి బంతులు అందిస్తూ సాయం చేశాను. నెట్స్లో అతడి వెనుక నిలబడి చూస్తూ బ్యాటింగ్ నేర్చుకున్నా. అయితే అతడు లెఫ్ట్ హ్యాండర్, నేను కుడిచేతి వాటం బ్యాటర్ని. అతడిని చూస్తూ బ్యాటింగ్ నేర్చుకోవడంతో లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయా'' అని స్మృతి మంధాన చెప్పింది.
ఈ షోలో స్మృతితో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ కూడా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అతడు వ్యక్తిగత కారణాలతో భారత్కు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. షోలో శుభ్మన్ గిల్తో ఉన్న అనుబంధం గురించి ఇషాన్ చెప్పాడు.