టీమిండియా మాజీ క్రికెటర్, కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మైదానంలో దూకుడుగా ఉంటాడనే విషయం తెలిసిందే. ప్రత్యర్థి కవ్విస్తే సంకోచించకుండా గొడవకు దిగడానికి సంసిద్ధంగా ఉండే వైఖరి గంభీర్ది. విదేశీ ఆటగాళ్లతోనే కాదు, ఐపీఎల్లో భారత్ ప్లేయర్ల మీదకు గంభీర్ దూసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆటగాడిగానే కాకుండా, మెంటార్గానూ గంభీర్ గత సీజన్లో కోహ్లితో గొడవపడిన సంగతి తెలిసిందే.
అయితే గ్రౌండ్లో అలా దూకుడుగా వ్యవహరించడానికి ప్రత్యేక కారణం ఉందని గంభీర్ వివరించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జట్టును దూకుడుగా ఉంచేందుకు తాను అలా చేసే వాడినని పేర్కొన్నాడు. ఈ ప్రక్రియలో కొన్ని చేయకూడనివి, తనకి ఇష్టం లేనివి కూడా చేయాల్సి వచ్చిందని గంభీర్ అన్నాడు.

''మీ జట్టు దూకుడుగా ఉండాలనుకుంటే కెప్టెన్ దూకుడైన విధానాన్ని కలిగి ఉండాలి. ఈ క్రమంలో మీరు కొన్నిసార్లు కోరుకోని పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నా కెరీర్లో చేయకూడని పనులు ఎన్నో చేశాను. అయితే కెప్టెన్ అగ్రెసివ్గా లేకపోతే టీమ్ దూకుడుగా ఉండదని నేను నమ్ముతాను. మైదానంలో మన భావాల్ని వ్యక్తపరిచే హక్కు ప్రతి ఆటగాడికి, కెప్టెన్కు ఉంటుందని భావిస్తాను''
''అయితే మైదానంలో ఆటగాడి స్వభావాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. మైదానం అవతల అతను ఎలా ఉంటాడనే దాన్ని బట్టి ఓ నిర్ణయానికి రావాలి'' అని గంభీర్ పేర్కొన్నాడు. మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు ఆవేశంగా ఉండే గంభీర్ పోరు ముగిసిన అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో సరదగా మాట్లాడుతుంటాడు. కాగా, ఈ సీజన్లో కేకేఆర్కు మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.
సునీల్ నరైన్ను తిరిగి ఓపెనర్గా పంపి మంచి ఫలితాలను గంభీర్ పొందుతున్నాడు. యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ జట్టు విజయాల్లో మెంటార్గా కీలకపాత్ర పోషిస్తున్నాడు. హర్షిత్ రాణా, రమన్దీప్, రఘవంశీ వంటి యువఆటగాళ్లు సత్తాచాటడానికి గంభీర్ పరోక్ష కారణం. కాగా, కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు గంభీర్ రెండు ట్రోఫీలు అందించిన విషయం తెలిసిందే. 2012, 2014 సీజన్లలో జట్టును విజేతగా నిలిపాడు.