
హైదరాబాద్: పదేళ్ల తర్వాత రంజీ క్రికెట్ ఫైనల్లోకి ఢిల్లీ జట్టు ప్రవేశించింది. బెంగాల్తో జరిగిన సెమీఫైనల్లో కునాల్ చందేలా అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్, టీమిండియా వెటరన్ క్రికెట గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలవడంతో 113 (192 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సు) సాయంతో సెంచరీని నమోదు చేశాడు.
దీంతో దేశవాళీ క్రికెట్లో కునాల్ చందేలా పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. దీంతో ఎవరీ కునాల్ చందేలా అన్న ప్రశ్న ఉత్పన్నం అయింది. కునాల్ చందేలా ప్రస్తుతం గర్వాల్లోని హేంబటి నందన్ బహుగుణ యూనివర్సిటీలో బీఎస్సీ(ఐటీ) చదువుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
క్రికెట్ కోసం డిగ్రీ సెమీస్టర్ పరీక్షలకు కూడా గైర్హాజరయ్యాడు. డిసెంబరు 20 నుంచి అతడికి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ఢిల్లీ జట్టు ఫైనల్ చేరాలంటే సెమీఫైనల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కునాల్ పరీక్షలు మాని మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ఈ విషయంలో వర్సిటీ యాజమాన్యం కుటుంబ సభ్యులు అతడికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సెమీఫైనల్లో బెంగాల్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. తాను ఎదుర్కొన్న 192 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం కునాల్ మాట్లాడుతూ 'యూనివర్సిటీ క్రికెట్లో ఎంతో నేర్చుకున్నా. యూనివర్సిటీ క్రికెట్ నుంచి గతంలో ఢిల్లీ రంజీ జట్టుకు ఆడిన క్రికెట్ దిగ్గజాల గురించి తెలుసుకున్నా. విజయ్ ట్రోఫీలో మూడు సెంచరీలు సాధించడంతో సెలక్టర్లు నన్ను ఢిల్లీ రంజీ జట్టులోకి ఎంపిక చేశారు' అని కునాల్ తెలిపాడు.
క్రికెట్ కోసం సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయిన విషయంపై కూడా కునాల్ స్పందంచాడు. 'ఈ నెల 20 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మ్యాచ్ కోసం పరీక్షలను పక్కనపెట్టా. రంజీ ట్రోఫీ అనంతరం సమయం దొరకగానే క్లాసులు హాజరై చదివి పరీక్షలు రాస్తా' అని చెప్పుకొచ్చాడు.
'ఇండియన్ పబ్లిక్ స్కూల్లో 9, 10వ తరగతులను చదివా. ప్రస్తుతం ఢిల్లీ తరుపున ఆడుతున్న రిషబ్ పంత్ స్కూల్లో నా జూనియర్గా ఉన్నాడు. నా చిన్నప్పటి కోచ్ మనోజ్ రావత్' అని కునాల్ తెలిపాడు. కునాల్ చందేలా తండ్రి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కావడం విశేషం.
'ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గౌతం గంభీర్ నాకు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆడమని సూచించాడు. ఐపీఎల్లో ఆడాలన్నది తన లక్ష్యం కాదని భారత జట్టు తరుపున ఆడాలన్నదే తన కల' అని కునాల్ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.