పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. అయితే అడిలైడ్ టెస్టు గురించి విశ్లేషిస్తూ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ట్రావిస్ హెడ్ X మహ్మద్ సిరాజ్ మధ్య జరిగిన వాగ్వాదం గురించి మాట్లాడుతూ.. సిరాజ్ గురించి ఆందోళన చెందానని పాంటింగ్ అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ నుంచి సిరాజ్ ఎదుర్కోవాల్సిన పరిణామాలపై ఆందోళన పడ్డానని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్లో హెడ్ను సిరాజ్ ఔట్ చేసిన అనంతరం ఇద్దరి వాగ్వాదం జరిగింది. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత హెడ్.. సిరాజ్ను చూస్తూ మాటలతో బదులిచ్చాడు. మరోవైపు సిరాజ్ ఇక వెళ్లిపో.. అంటూ సింబాలిక్గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.

అయితే దీనిపై ట్రావిస్ హెడ్ స్పందిస్తూ.. తాను బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నానని, కానీ సిరాజ్ మాత్రం అపార్థం చేసుకున్నాడని అన్నాడు. మరోవైపు సిరాజ్ మాట్లాడుతూ.. ట్రావిస్ హెడ్ అబద్దాలు చెప్పాడని, టీవీలో రిప్లే చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. మొత్తంగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరూ కలిసిపోయారు. ఈ సంఘటనను వదిలేసి ముందుకు సాగుతామని వెల్లడించారు.

ఈ సంఘటనపై ఐసీసీ సీరియస్ అయ్యింది. హెడ్-సిరాజ్లపై మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. అంతేగాక ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. కాగా, ఈ గొడవపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ''బాగా బౌలింగ్ చేశావని హెడ్ అన్నాడు. అయితే అంతకంటే ముందు బంతికి సిక్సర్ బాదడంతో సిరాజ్ అంత హ్యాపీగా ఉండటం కష్టమే. నేను ఆ సమయంలో కామెంటరీ బాక్స్లో ఉన్నాను. హెడ్ను సిరాజ్ పంపిస్తున్న విధానాన్ని చూసి.. సిరాజ్ గురించి ఆందోళన చెందాను. ఎందుకంటే దానికి అంపైర్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సాగనంపడాన్ని మ్యాచ్ రిఫరీ-అంపైర్లు ఇష్టపడరు'' అని పేర్కొన్నాడు.