సిడ్నీ: భారత ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన తర్వాత.. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఆడటం కొంత కష్టమేనని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ ఆదివారం అన్నాడు. మార్చి 26వ తేదీన ఆస్ట్రేలియా - భారత్లు సెమీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మాక్స్వెల్ మాట్లాడాడు.
వ్యక్తిగతంగా భారత ఆటగాళ్లతో తనకు మంచి సంబంధం ఉందని చెప్పాడు. 26 ఏళ్ల మాక్స్వెల్ గత మూడేళ్లుగా ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు భారత జట్టు ఆటగాళ్లతో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పాడు.

ఐపీఎల్లో వివిధ జట్లతో ఆడటం వల్ల మరింత ఎక్కువ మంది స్నేహితులు, వారి గురించి మరింత ఎక్కువ తెలుసుకునేందుకు ఉపయోగపడిందని చెప్పాడు. మ్యాచ్ల అనంతరం వారితో కలిసి గడపడం, కలిసి భోజనం చేయడం.. ఇలాంటివన్నీ మంచి స్నేహానికి దారి తీశాయని చెప్పాడు. వారితో తాను ఎప్పుడు టచ్లో ఉంటానని చెప్పాడు.
అలాంటి భారత ఆటగాళ్లతో.. వారికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆడటం కొంత ఇబ్బందేనని చెప్పాడు. అందులో కొందరు తనతో కలిసి ఐపీఎల్లో ఆడిన వారు ఉన్నారని, ఇప్పుడు వారితో పోటీ పడవలసి వస్తోందని అన్నాడు. మాక్స్వెల్ హర్భజన్ సింగ్ పైన ప్రశంసలు కురిపించాడు. అతను బ్రిలియంట్ అని, ఫన్నీయెస్ట్ గాయ్ అని కితాబిచ్చాడు.