చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, 20 ఏళ్లు కుర్రాడిగా ఆడుతున్నాడని అన్నాడు. 42 ఏళ్ల వయసులో ధోనీ ధనాధన్ షాట్లతో, మెరుపు వికెట్ కీపింగ్తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ను మలుపుతిప్పే పరుగులు సాధిస్తున్నాడు.
ఐపీఎల్-2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ బ్యాటర్గా మహీ 110 సగటుతో టాప్లో ఉన్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 110 పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రమే ఔటయ్యాడు. అది కూడా నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇక అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ జాబితాలో ధోనీ 229తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా, 'మీ యువ వికెట్ కీపర్ ఎలా రాణిస్తున్నాడు?' అని యాంకర్ సరదాగా అడిగిన ప్రశ్నకు సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బదులిచ్చాడు. ''ధోనీ అదరగొడుతున్నాడు. అతను ప్రస్తుతం భారత జట్టులో ఉండాలి. అంత గొప్పగా రాణిస్తున్నాడు. మంచి షాట్లతో అలరిస్తున్నాడు. ధోనీ యంగ్గా ఉన్నాడని చెప్పడానికి కారణం అతని కఠోర సాధన. సీజన్ ప్రారంభానికి ముందు అతను ఎంతో ప్రాక్టీస్ చేశాడు. గత అయిదు-ఆరేళ్లలో నేను చూడని అత్యుత్తమ ఆటతో ధోనీ రాణిస్తున్నాడు''
''అందుకే ధోనీ వయసు 20ల్లో ఉందనిపిస్తోంది. ఆ తరహాలో అతను క్రికెట్ ఆడుతున్నాడు. అతను యువకుడిలా మరిన్ని సంవత్సరాలు ఆడాలని కోరుకుంటున్నాను'' అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయిదు టైటిళ్లు గెలిచిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ జట్టు పగ్గాలను అందుకున్నాడు.
అంచనాలను అందుకుంటూ కెప్టెన్, బ్యాటర్గా రుతురాజ్ నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. కాగా, సీజన్ ఫస్ట్ హాఫ్లో సత్తాచాటిన సీఎస్కే సెకండ్ హాఫ్లో తడబడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ కోసం సీఎస్కే తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది. పది మ్యాచ్లు ఆడిన చెన్నై అయిదు విజయాలతో పది పాయింట్లు సాధించింది.