వరల్డ్ కప్లో కాస్త ఆలస్యంగా తుదిజట్టులోకి వచ్చినా తర్వాత సంచలన ప్రదర్శనలు చేశాడు టీమిండియా పేసర్ మహ్మద్ షమి. పిచ్ బౌలింగ్కు గొప్పగా అనుకూలించకపోయినా వికెట్ల వేట కొనసాగించాడు. మెగాటోర్నీలో ఏడు మ్యాచ్ల్లోనే 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ గా నిలిచాడు. అతడి ప్రదర్శన చూసి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..షమికి 'మిస్టర్ వరల్డ్ కప్' బిరుదు ఇవ్వాలని ప్రశంసించాడు.
వరల్డ్ కప్ అనంతరం షమి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరికొన్ని రోజుల్లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం సఫారీ గడ్డకు బయలుదేరనున్నాడు. అయితే ఓ ఇంటర్యూలో షమి ఆసక్తికర విషయాలు చెప్పాడు. అలాగే అతడిపై వచ్చిన విమర్శలకు ఘూటుగా స్పందించాడు.

''ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఎవరూ ఎవరితో మాట్లాడుకోలేదు. కనీసం ఎవరూ ఏమి తినలేదు. కానీ సడెన్గా డ్రెస్సింగ్ రూమ్కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అది అందరికీ సర్ప్రైజ్. మా అందరితో మోడీ మాట్లాడారు. ఆయన మాటలు ఎంతో కీలకంగా మారాయి''
''జిమ్లో నా కంటే ఏ క్రికెటర్ బరువులెత్తలేడు. కానీ సోషల్ మీడియాలో నేను పంచుకోను. అందుకే ఈ విషయం ప్రజలకు తెలియదు. లెగ్ ప్రెస్పై 750 కేజీల బరువును లేపగలను'' అని షమి చెప్పాడు.
అయితే వరల్డ్ కప్లో శ్రీలంకతో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అనంతరం షమీ మోకాళ్లపై కూర్చొని రెండు చేతులతో నేలను టచ్ చేశాడు. నమాజ్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ సెలబ్రేషన్స్ ను కొంతమంది తప్పుబట్టారు. ఈ విషయంపై షమి ఘాటుగా స్పందించాడు.
''నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు ఆపుతారు? నమాజ్ చేసేటప్పుడు నన్ను ఎవరూ అడ్డుకోరు. నమాజ్ చేయాలనుకుంటే చేస్తా. ఇందులో సమస్య ఏంటి? నేను గర్వించదగిన ముస్లింనని చెబుతా. ఓ భారతీయుడినని గర్వంగా పేర్కొంటా. గతంలో 5 వికెట్లు తీసినప్పుడు నమాజ్ చేశానా? నేను చాలా సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాను. ఇక నేను ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను'' అని షమి పేర్కొన్నాడు.