RCB VS PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ 158 పరుగుల సక్సెస్ ఫుల్ లక్ష్య ఛేదనలో దేవ్దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు), విరాట్ కోహ్లీ (73*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇద్దరు కలిసి జట్టును విజయం దిశగా నడిపించి ఆకట్టుకున్నారు. ఇద్దరు కలిసి 103 పరుగుల కీలక భాగస్వమ్యాన్ని నెలకొల్పారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి వరించింది.
నాకెందుకిచ్చారో..
అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. "ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. ఈ రెండు పాయింట్లు ప్లే ఆఫ్స్ రేసులో భారీ మార్ తెస్తాయి. బయట స్టేడియాల్లో మేం అద్భుతంగా ఆడుతున్నాం. ఎనిమిది పాయింట్ల నుంచి పది పాయింట్లకు వెళ్తే.. పాయింట్స్ టేబుల్లో భారీ తేడా వస్తుంది. ప్రతి మ్యాచ్లో రెండు పాయింట్లు సాధించాలన్నదే మన మైండ్ ఉండాలి. నేను మరింత దూకుడుగా ఆడాలనుకున్నాను. నిజం చెప్పాలంటే, నాకన్నా దేవ్ (పడిక్కల్) మ్యాచ్లో బాగా ఆడాడు. ఈ అవార్డు అతడికి ఇవ్వాల్సింది. కానీ నాకు ఎందుకు ఇచ్చారో తెలీదు."
అలా జరిగితే చాలు.. గేమ్ మనదే..
"నేను ఒక ఎండ్ లో ఆడుతూ.. చివర్లో దూకుడు పెంచాలనుకున్నాను. ఇలా ఆడితే ఒక టెంప్టేషన్ ఉంటుంది. గత మ్యాచులో తక్కువ ఓవర్ల కావడం వల్ల మాకు కష్టంగా అనిపించింది. టీ20లో ఓ మంచి భాగస్వామ్యం చాలు, గేమ్ మారిపోతుంది. వేలంలో మాకు కావాల్సిన జట్టు దక్కింది. రోమారియో జట్టులోకి రావడం, లివింగ్ స్టన్ ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చింది. డేవిడ్, జితేష్, పటీదార్ లాంటి ఆటగాళ్లు తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. గెలవాలన్న తపన వాళ్లలో ఉంది. ఇలాంటి ఆటతీరుతో గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి." అని విరాట్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచులలో విరాట్ కోహ్లీ.. నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో మూడు అజేయంగా సాధించినవే. అలానే ఈ 8 మ్యాచుల్లో 59, 31, 7, 67, 22, 62, 1, 73 పరుగులు చేశాడు.
