హైదరాబాద్: 'ఈ పొగడ్తలు, సత్కారాలు అలాంటివేమీ నాకు అక్కర్లేదు.' ఈ మాటలు అంటోంది ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆరో వన్డేలో అద్భుతంగా ప్రదర్శించి 35వ వన్డేను పూర్తి చేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. 'నేను ఎవరికీ పోటీ అనుకోను. కేవలం సిద్ధమైనంత వరకూ ప్రదర్శించగలిగానా లేదా అన్నది చూస్తాను' అని పేర్కొన్నాడు.
అతను మాట్లాడుతూ.. కేవలం నా జట్టుకు నేనెంత వరకు చేయగలనో అంతే ఆలోచిస్తా. జట్టు గురించి ఆలోచిస్తేనే విజయాన్ని చేరుకోగలం. అలా కాకుండా వ్యక్తిగత స్కోరును లక్ష్యంగా చేసుకుని పోరాడితే మాత్రం జట్టును గెలిపించలేం. ఇదే నేపథ్యంలో పోరాడతాను. కానీ, నేను బిరుదులు, సత్కారాలు ఆశించి ఆడను' అని అభిప్రాయపడ్డాడు.
'ఇదే గదిలో రెండు టెస్టుల వైఫల్యాల అనంతరం పాల్గొన్నప్పుడు మీడియాతో ఇలానే మాట్లాడాను. ఇప్పుడు ఇలానే మాట్లాడుతున్నాను. తొంబై శాతం జట్టు గెలిచేందుకే కష్టపడతాను. పొగడ్తలకు పొంగిపోయి కలల్లో బతకాలని నాకు లేదు. నిజం చెప్పాలంటే ఇది నాకు పెద్ద విషయం కాదు' అని ఆరో వన్డేలో అతని ప్రదర్శన గురించి కొట్టి పడేశాడు.
మరో వైపు రవిశాస్త్రి.. కోహ్లీని పొగిడేందుకు పదాలు సరిపోవేమో డిక్షనరీ కొనుక్కోండి' ఈ మాటలు అంటోంది ఎవరో కాదు భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి. సిరీస్ గెలవడమే కాదు. కేవలం నియమానుసారం జరగాల్సిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసి.. నాయకుడిగా జట్టు సభ్యులతోనూ అదే రీతిలో ఆడించాడు. దీనికి గానూ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ప్రధాన కోచ్ విలేకరుల ముందు కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు.