న్యూఢిల్లీ: జింబాబ్వే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ధోనీ సంతోషంతో ఉప్పొంగిపోతాడని భావించిన వారికి అతని సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది! సిరీస్ గెలుచుకున్న తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనీ మాట్లాడాడు.
తన కుమార్తె జీవా తనను గుర్తుపడుతుందో లేదోనని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా పర్యటన, ఆసియా కప్ టీ20, ఆ తర్వాత శ్రీలంకతో టీ20 సీరీస్, అది అయిపోయాక ప్రపంచ ట్వంటీ 20, ఆ వెంటనే ఐపీఎల్, ఇప్పుడు జింబాబ్వే పర్యటన.. ఇలా గత ఆరు నెలలుగా ఇంటికి దూరంగా గడపాల్సి వస్తోందన్నాడు.

సుదీర్ఘ కాలంగా దూరంగా ఉంటున్నందుకు జీవా తనను గుర్తుపడుతుందో లేదోనని వ్యాఖ్యానించాడు. ట్వంటీ 20 మ్యాచ్ల తర్వాత ధోనీ కుమార్తెను చేరుకోనున్నాడు. విండీస్ సిరీస్లో విశ్రాంతి తీసుకోనుండడంతో మళ్లీ న్యూజిలాండ్ సిరీస్ వరకు ధోనీ జట్టుతో కలవాల్సిన అవసరం లేదు.
దీంతో సుమారు మూడు నెలల పాటు కుమార్తెతో ధోనీ సరదగా గడిపే సమయం దొరుకుతోంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ సందర్భంగా తన పాప జివా పుట్టినపుడు ధోనీ దగ్గర లేడు. తర్వాతి ఏడాది కాలంలోనూ తన పాపతో గడిపింది కొన్ని నెలలు మాత్రమే.
గత ఐదారు నెలలుగా విరామం లేకుండా మ్యాచ్లు ఆడుతున్నాడు ధోని. అయితే ప్రస్తుత జింబాబ్వే పర్యటన ముగిశాక ధోనికి సుదీర్ఘ విరామం రాబోతోంది. ఈ నేపథ్యంలో, ఈ విరామాన్ని తన పాపతో గడపడానికే వినియోగిస్తానని చెప్పాడు ధోనీ.