Ravi Shastri: ఐపీఎల్ 2025 తర్వాత జూన్లో భారత్ ఇంగ్లాండ్లో పర్యటించనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో టీమిండియాకు ఇప్పుడు కొత్త టెస్ట్ కెప్టెన్ అవసరం. ఈ పర్యటనకు టీమిండియాను ఇంకా ప్రకటించలేదు. కానీ కొత్త కెప్టెన్ గురించి ప్రతిరోజూ ఊహాగానాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ లేకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించాడు. అందువల్ల జస్ప్రీత్ బుమ్రాను తదుపరి టెస్ట్ కెప్టెన్గా పరిగణించారు. ఇప్పుడు టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా చేయకూడదని అభిప్రాయపడ్డారు.
కొత్త కెప్టెన్ గురించి రవిశాస్త్రి కీలక ప్రకటన
ఈ రోజుల్లో టెస్టుల్లో టీమిండియా కొత్త కెప్టెన్ కోసం చాలా చర్చలు జరుగుతున్నాయి. కొందరు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా చూడాలని కోరుకుంటుండగా.. మరికొందరు జస్ప్రీత్ బుమ్రా.. రవీంద్ర జడేజాలను కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఐసీసీ సమీక్షలో మాట్లాడుతూ.. "జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ కావాలని నేను కోరుకోవడం లేదు. కెప్టెన్గా చేస్తే అతడిని బౌలర్గా కోల్పోతాం. మ్యాచ్కు తనను తాను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నాను. గాయం తర్వాత బుమ్రా తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్లో కేవలం 4 ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. టెస్టుల్లో అయితే 10 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి ఉండకూడదని అనుకుంటున్నాను. "అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ పేర్లను తీసుకున్న మాజీ కోచ్
శుభ్మన్ గిల్ బాగా రాణిస్తున్నాడని.. అతడికి ఒక అవకాశం ఇవ్వాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. శుభ్మన్ గిల్ వయస్సు కేవలం 25-26 సంవత్సరాలు అని.. గిల్ కు ఇప్పుడు ఒక అవకాశం రావాలన్నారు. ఇది కాకుండా రిషబ్ పంత్ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు దశాబ్ధ కాలం పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇద్దరికీ కెప్టెన్సీలో చాలా అనుభవం ఉందన్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టులు
ఐపీఎల్ 2025 తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఇందులో మొదటి మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది.