
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ముగింపుకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో జరిగే తుదిపోరులో హైదరాబాద్తో తలపడేందుకు చెన్నైసూపర్కింగ్స్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఈ టోర్నీలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సేవలను తక్కువగా వినియోగించుకోవడంపై స్పందించాడు. ఈ నిర్ణయంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.
'నా ఇంట్లో చాలా కార్లు, బైక్లు ఉన్నాయి. అయితే ఒకేసారి అన్నింటిపై సవారీ చేయలేం కదా. అలాగే చాలాసార్లు.. ముఖ్యంగా ఆరు, ఏడుగురు బౌలర్లు మనకు అందుబాటులో ఉన్నప్పుడు.. అక్కడ పరిస్థితులను చూడాలి. ఎవరూ బ్యాటింగ్ చేస్తున్నారో గమనించాలి. ఆ సమయానికి ఎవరు అవసరమో వారిని వినియోగించుకోవాలి. నేను జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నా' అని ధోనీ తెలిపాడు.
'అందుకే చివరి మ్యాచ్లో హర్భజన్ సేవలు అవసరమని అనిపించలేదు. అయితే ఏ ఫార్మాట్లోనైనా హర్భజన్ నిజంగా ఎంతో అనుభవమున్న ఆటగాడు' అని ధోనీ అన్నాడు. ఈ సీజన్లో చెన్నై తరఫున హర్భజన్.. మొత్తం 15 మ్యాచ్లకు గాను 13 మ్యాచ్లే ఆడాడు. 8.48 ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు.
ముంబైలో జరిగే ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ జట్లు నేడు తలపడనున్నాయి. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లే చివరికి ఫైనల్లో తలపడటం విశేషం. ఈ మ్యాచ్లో సత్తా చాటి మూడోసారి టైటిల్ గెలవాలని చెన్నై పట్టుదలగా ఉండగా.. చెన్నైపై నెగ్గి రెండోసారి కప్ గెలవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది. సీజన్ మధ్యలో ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళన కలిగించినా.. తుది జట్టు ఎంపిక కోసం ఆటగాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారని ధోని తెలిపాడు.