
హైదరాబాద్: టీమిండియాకు కెప్టెన్గా నేతృత్వం వహించే అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో తనకు తెలియదని ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో వన్డే, టీ20సిరిస్కు సారథ్య బాధ్యతలును స్వీకరించిన రోహిత్ శర్మ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు.
మూడు వన్డేల సరిస్ను 2-1తో గెలవడంలో రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడు. రెండో వన్డేలో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం టీ20 సిరీస్లోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. శ్రీలంకతో ఆదివారం ముంబైలో జరిగే చివరి టీ20నే రోహిత్కు తాత్కాలిక కెప్టెన్గా చివరి మ్యాచ్ కానుంది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ 'తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నందున ఒత్తిడి ఉంది. ముంబై మ్యాచ్లో కూడా నాపై ఒత్తిడి ఉంది. మళ్లీ ఎప్పుడు కెప్టెన్ అవుతానో తెలీదు. అందువల్ల మైదానంలో ప్రతి క్షణం నాకు ముఖ్యమైనది' అని రోహిత్ శర్మ చెప్పాడు.
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఐపీఎల్లో ఆ జట్టుకు మూడు టైటిళ్లు అందించినా టీమిండియాకు నేతృత్వం వహిస్తున్నప్పుడు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. 'ధర్మశాలలో తొలి వన్డే తర్వాత ఎంతో ఒత్తిడికి లోనయ్యా. వన్డేల్లో అత్యంత అల్ప స్కోరుకు ఆలౌటయ్యే ప్రమాదం కూడా ఏర్పడింది. 120 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో నా నాయకత్వం గురించి చాలా ఆందోళన పడ్డా' అని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో తాను డబుల్ సెంచరీ గురించి ఆలోచించలేదని, సాధ్యమైనన్ని ఎక్కు వ పరుగులు చేయాలని మాత్రమే అనుకున్నానని తెలిపాడు. ఆ మ్యాచ్లో 43 బంతుల్లో 10 సిక్స్లు, 12 ఫోర్లతో 118 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని రోహిత్ శర్మ అన్నాడు. 'నేను ఇతరుల్లా బంతిని బలంగా బాదలేను. అందుకే టైమింగ్పై ఆధారపడతా. నా బలాలు, బలహీనతలేమిటో నాకు తెలుసు. అందుకే ఇండోర్ టీ20లో పిచ్పై పగుళ్లు వచ్చే వరకు ఎదురుచూశా. ఫోర్లు, సిక్సులు బాదా. మైదానం అన్ని వైపులా బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తా' అని అన్నాడు.
'తాజా టీ20లో డబుల్ సెంచరీ గురించి ఆలోచించలేదు. మరిన్ని పరుగులు రాబట్టాలని ప్రయత్నిస్తా. కొన్ని సార్లు పరుగులు లభిస్తాయి. కొన్ని సార్లు కుదరదు. ఇవన్నీ ఆటలో భాగమే. ఎక్కడికి బంతిని పంపించాలని అనుకుంటానో అలాంటి షాట్లే ఆడతా. సిక్సర్లు బాదడం కన్నా ఫీల్డర్ల మధ్యలోకి బంతిని పంపిస్తే సంతోషంగా ఉంటుంది' అని రోహిత్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.