
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్ సెమీస్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమికి తన అతి విశ్వాసమే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఓల్డ్ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్ స్టేజ్లో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన టీమిండియా కీలక సెమీస్ పోరులో ఓటమిపాలడవం అటు అభిమానులతో పాటు ఇటు భారత క్రికెటర్లను సైతం నిరాశకు గురి చేసింది. ఆ ఓటమిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు.
తాజాగా వరల్డ్కప్లో కివీస్ చేతిలో ఓడిపోవడంపై కోహ్లీ మాట్లాడుతూ "ఆ వరల్డ్కప్ ఓటమి నాపై తీవ్ర ప్రభావం చూపింది. నేను కూడా చాలా బాధపడ్డా. జట్టు సభ్యులు కూడా ఆ ఓటమి బారిన పడ్డారు. జట్టుకు నా అవసరం ఉందని నాకు తెలుసు. నేను క్రీజులో బ్యాటింగ్కు వెళ్లేవరకూ బలమైన ఫీలింగ్తో ఉన్నా" అని అన్నాడు.
"ఆ మ్యాచ్లో నాటౌట్గా మ్యాచ్ని ముగిస్తానని అనుకున్నా. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో నాపై నేను చాలా విశ్వాసంతో ఉన్నా. కానీ విఫలమయ్యా. ముందుగా అంచనా వేయలేమని నాలోని ఇగో ప్రశ్నించింది. నేను ఓడిపోవడాన్ని అసహ్యించుకుంటాను. నేను చేయాల్సి పనిని కూడా చేయలేకపోతే నాలో నిస్సత్తువ ఏర్పడుతుంది" అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ తెలిపాడు.
ఆ మ్యాచ్లో కోహ్లి ఒక పరుగుకే ఔట్ కాగా... టోర్నీ మొత్తం సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ ఒక పరుగుకే పెవిలియన్కు చేరాడు. అయితే, రవీంద్ర జడేజా(77), ధోని(50)లు హాఫ్ సెంచరీలతో చివరి వరకు పోరాడినప్పటికీ టీమిండియాను గెలుపు దిశగా నడిపించలేకపోయారు. దీంతో భారత జట్టు 221 ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.